News

ఈనెల 25న అయోధ్యలో పతాక ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ

130views

నవంబర్‌ 25న అయోధ్యలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. రామజన్మభూమి సముదాయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రామాలయంపై పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ఆలయ ట్రస్ట్‌ తాజాగా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తున్నట్లు తెలిపింది. ఆరోజున ప్రధానితోపాటూ వీవీఐపీలు హాజరుకానున్నట్లు తెలిపింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ప్రధాని మోదీ పర్యటన దాదాపు మూడు గంటల పాటూ కొనసాగనున్నట్లు వివరించింది.

అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం ప్రజలు రూ.3,000 కోట్లకుపైగా విరాళాలు ఇచ్చినట్లు రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్‌ నృపేంద్ర మిశ్రా ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. 2022లో నిర్మాణం కోసం విరాళాలు ప్రకటించినప్పటి నుంచి ఈ మొత్తం వచ్చినట్లు తెలిపారు. నవంబరు 25న ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకలకు దాతలందరినీ ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. ఆరోజు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని, రామాలయంపై పతాకాన్ని ఆవిష్కరిస్తారని వివరించారు. దాదాపు 8 వేల మందికిపైగా ఆహ్వానితులు ఇందులో పాల్గొంటారని ఆయన చెప్పారు.