News

ఇజ్రాయెల్‌లో భారతీయ రాజు విగ్రహం

163views

రెండో ప్రపంచ యుద్ధంలో కొందరు పోలండ్‌కు చెందిన పిల్లల్ని, యూదు బాలల్ని రక్షించేందుకు విశేష కృషిచేసిన మహారాజా దిగ్విజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింహ్‌జీ విగ్రహాన్ని ఇక్కడి యూదు రైతుల సహకార సంఘమైన ‘‘మోషవ్‌’’లో ఆవిష్కరించారు. మహారాజా రంజిత్‌సింహ్‌జీ గుజరాత్‌లో ప్రస్తుతం జామ్‌నగర్‌గా ప్రసిద్ధమైన నవనగర్‌ సంస్థానాధీశుడు. ప్రపంచ యుద్ధకాలంలో అత్యంత దయాగుణం కనబరిచిన ఆ సంస్థానాధీశుని విగ్రహం స్థాపించడం ద్వారా ఇండియన్‌ జ్యూయిష్‌ హెరిటేజ్‌ సెంటర్, కొచిని జ్యూయిష్‌ హెరిటేజ్‌ సెంటర్‌లు ఆయనను మరణానంతరం సత్కరించాయి. రెండో ప్రపంచ యుద్ద కాలంలో మహారాజా పోలండ్‌కు చెందిన దాదాపు వేయి మంది పిల్లల్ని, కొందరు యూదు బాలల్ని రక్షించి 1942లో వారి కోసం జామ్‌నగర్‌ ప్రాంతంలోని బాలాచడి గ్రామం వద్ద ఒక గృహాన్ని కూడా నిర్మించారు. ఆయన విగ్రహాన్ని స్థాపించే కార్యక్రమంలో ఇజ్రాయెల్‌లో భారత రాయబారి జేపీ సింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జామ్‌నగర్‌ సంస్థానాధీశుని దయాగుణాన్ని ప్రస్తుతించారు.