News

సామసస్య భావనే సమాజానికి హితవు

222views

సమ, మనస్‌ అనే రెండు సంస్కృత పదాల కలయిక నుంచి పుట్టిన ‘సామనస్యం’ అంటే ఏకాభిప్రాయం, ఐకమత్యం, పరస్పర సహకారం. సామూహికంగా ఒకే లక్ష్యం కోసం, ఒకే ఆలోచనలతో కలిసి పనిచేసే ఈ సామరస్య భావనను అథర్వ వేదంలో ‘సామనస్యమ్‌’ అనే సూక్తం ప్రస్తావిస్తుంది. వేదాలు చెప్పే మంచి విషయాల్లో ప్రత్యేకించి నిత్యజీవితానికి సంబంధించి ఇందులో ఎన్నో ఆచరణీయమైనవి ఉన్నాయి. ఒకరిపట్ల మరొకరు ప్రేమాభిమానాలతో క్రమశిక్షణ పాటిస్తూ జీవించమని ప్రబోధిస్తుంది ‘సామనస్యమ్‌’ సూక్తం. కక్షలూ కార్పణ్యాలతో కాలం వృథా చేసుకునే జనాలకు విద్వేష రహిత జీవిత ప్రాధాన్యాన్ని వివరిస్తుంది.

‘సహృదయం సాంమనస్యమవిద్వేషం కృణోమివః’ అనే శ్లోకపాదంతో ప్రారంభమయే ఈ సూక్తంలోని మొదటి రుక్కు సమాజానికి, కుటుంబానికి చక్కని సందేశాన్ని అందిస్తుంది. లేగదూడలు ఆవులను, తల్లులు బిడ్డలను ప్రేమించినట్లు ప్రతి ఒక్కరు ఇతరులను ప్రేమిస్తే సమాజంలో సుఖశాంతులు నెలకొంటాయని, తద్వారా వ్యక్తిగత సౌఖ్యం కూడా లభిస్తుందని ఈ రుక్కు వక్కాణిస్తుంది. రెండో రుక్కు కుటుంబ సభ్యుల ప్రవర్తనకు సంబంధించింది. కొడుకు- తండ్రికి అనుకూలంగా ఉండాలని, తల్లి- బిడ్డల పట్ల వాత్సల్యంతో మెలగాలని, భార్యాభర్తలు ఒకరికొకరు మనసెరిగి మంచి మాటలతో సేదతీర్చుకోవాలని హితవు చెబుతుంది. తోబుట్టువులు ఒకరి పట్ల ఒకరు ప్రవర్తించే విధానాన్ని మూడో రుక్కు తెలియజేస్తుంది. అన్నదమ్ములు కలిసిమెలసి మెలగాలి; ఆస్తి పంపకాల వంటి ఇంటి విషయాలు రచ్చకెక్కరాదు. అక్కచెల్లెళ్లు అసూయా ద్వేషాలను విడిచి ఒకరిపట్ల ఒకరు అనురాగంతో జీవించాలి. ఒక తల్లి కన్న సంతానం తమలో తాము కలహించుకునే ఇంట్లో లక్ష్మి క్షణమైనా ఉండదని హెచ్చరిస్తుందీ రుక్కు. బతుకుదెరువు కోసం ఒకే సమాజంలో కలిసి జీవించే వ్యక్తులు ఐకమత్యంతో మెలిగే పద్ధతులను నాలుగో రుక్కు సోదాహరణంగా వివరిస్తుంది. ఒకే వృత్తిలో ఉన్నవారు పరస్పరం సహకరించుకుంటూ ఒకే లక్ష్యంతో ముందుకు సాగినప్పుడే వివాదాలకు తావు లేని జీవనభృతి లభిస్తుంది.

ఇంద్రాది దేవతలు తమకు లభించిన అమృతాన్ని ఐకమత్యంతోనే కాపాడుకున్నారు. ఈ విధమైన సామరస్య భావనే సమాజానికి హితవు చేకూరుస్తుంది. ’మానవ ప్రయత్నంలో లోపం లేకున్నా దైవానుగ్రహం దానికి తోడైనప్పుడే పని సానుకూలపడుతుంది’ అని అయిదో రుక్కు కర్మఫల రహస్యాన్ని విప్పి చెబుతుంది. దైవసన్నిధికి దూరం కాకుండా ఆత్మీయభావన నెలకొని ఉండాలంటే నిజనివాసాలలో నిత్యం దేవతలను స్తుతిస్తూ పూజాదికాలు సాగుతుండాలని ఈ రుక్కు నిర్దేశిస్తుంది. సఖ్యత, సభ్యత వంటి సద్గుణాలు రాశిపోసిన ఉత్తములను ఉద్దేశించినది ఆరో రుక్కు. సజ్జనులు తమలో తాము కలహించుకోరాదు. పరస్పరం అనురాగబద్ధులై జీవించాలి. సుమధుర సంభాషణలతో బాంధవ్యాలను మెరుగు పరుచుకోవాలి. అప్పుడే సంఘంలో సమైక్యత వర్ధిల్లుతుంది. సమాజంలోని సభ్యులనుద్దేశించి సాగే ఈ ఆఖరి రుక్కు సత్సందేశంతో వేదం లక్షించిన సామాజిక ప్రయోజనాన్ని సమర్థంగా సాధించింది.