News

భక్తులు డబ్బులు ఇచ్చేది కల్యాణ మండపాల నిర్మాణానికి కాదు : సుప్రీం

208views

ఆలయాలకు భక్తులు డబ్బులిచ్చేది కల్యాణ మండపాల నిర్మాణం కోసం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా పరిగణించకూడదంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును మంగళవారం సమర్థించింది. కాగా, ఐదు ఆలయాల నిధులతో తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో కల్యాణ మండపాల నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌ గతనెల 19న కొట్టివేసింది. కల్యాణ మండపాలు నిర్మించి, వాటిని వివాహ వేడుకల నిర్వహణ నిమిత్తం అద్దెకు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయం ‘మతపరమైన నిమిత్తం’ నిర్వచనం కిందకు రాదని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ‘భక్తులు తమ డబ్బును ఇలాంటి కల్యాణ మండపాల ఏర్పాటు కోసం ఆలయాలకు ఇవ్వరు. అవి ఆలయాలను మెరుగుపరిచేందుకై ఉండొచ్చు’ అని తెలిపింది. విద్య, వైద్య సంస్థల ఏర్పాటు తదితర దాతృత్వ కార్యక్రమాలకు ఆ డబ్బును వినియోగించాలని ధర్మాసనం సూచించింది.