News

బీహార్ ఓటర్ల జాబితాలో ఇద్దరు పాకిస్థానీ మహిళలు

168views

బీహార్ ఓటర్ల జాబితాలో పాకిస్థానీ జాతీయుల పేర్లు ఉన్నాయి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కూడా వారి ఓటర్‌ కార్డులను ధృవీకరించారు. అయితే ఆ వ్యక్తులు పాక్‌ జాతీయులని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగించడంతోపాటు దర్యాప్తునకు ఆదేశించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్‌లో ఈ సంఘటన జరిగింది. భాగల్పూర్ జిల్లా భికాన్‌పూర్‌లోని ట్యాంక్ లేన్‌లో వృద్ధులైన ఇద్దరు ముస్లిం మహిళలు నివసిస్తున్నారు.

పాకిస్థాన్‌కు చెందిన ఫిర్దౌసియా ఖానం 1956 జనవరి 19న మూడు నెలల వీసాపై భారత్‌కు వచ్చింది. అలాగే ఇమ్రానా ఖానం అలియాస్ ఇమ్రానా ఖాతూన్ కూడా మూడు సంవత్సరాల వీసాపై భారత్‌కు వచ్చింది. వారి వీసా గడువు ముగిసినప్పటికీ పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లలేదు. భికాన్‌పూర్‌లోని ట్యాంక్ లేన్‌లో నివసించే ముస్లిం వ్యక్తులను పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. మరోవైపు ఇబ్తుల్ హసన్ భార్య అయిన ఇమ్రానా ఖానం, మహ్మద్ తఫ్జీల్ అహ్మద్ భార్య అయిన ఫిర్దౌసియా ఖానం చాలా ఏళ్లుగా బీహార్‌లో జరిగే అన్ని ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు.

ఓటరు జాబితాలో ఉన్న ఈ వృద్ధ మహిళల పేర్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) ప్రక్రియలో కూడా ధృవీకరించారు. అయితే వారిద్దరూ పాకిస్థాన్ జాతీయులని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగించడంతోపాటు దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఓటర్‌ జాబితా నుంచి వారి పేర్లను తొలగించే ప్రక్రియను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు.

ఇలా ఉండగా, బీహార్‌లో 98.2 శాతం మంది కంటే ఎక్కువ మంది ఓటర్ల పత్రాలను సమర్పించినట్లు భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) ఆదివారం తెలిపింది. ఇక ఎనిమిది రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉందని వెల్లడించింది. ఓటర్ల ముసాయిదా జాబితాలో తప్పులసు సరిదిద్దడం మాత్రమే కాకుండా, వారి గణనఫారమ్‌లతో పాటు అవసరమైన పత్రాలను కూడా సమర్పించవచ్చని తెలిపింది.