News

తెలుగు రాష్ట్రాల నుంచి భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలు

216views

ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల యాత్రికుల కోసం బైద్యనాథ్‌ ధామ్‌తో సహా అయోధ్య–కాశీ పుణ్యక్షేత్ర పేరుతో భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక పర్యాటక రైలును నడపనున్నట్లు ఐఆర్‌సీటీసీ అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్‌ 9వ తేదీ ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి ఈ రైలు బయలుదేరనుంది. తొమ్మిది రాత్రుళ్లు, పది రోజులు సాగే ఈ యాత్రలో పూరిలోని జగన్నాథ ఆలయం, కోణార్క్‌ సూర్య దేవాలయం, డియోఘర్‌లోని బాబా బైద్యనాథ్‌ ఆలయం వారణాసిలోని కాశీ విశ్వనాథ్‌ ఆలయం, పరిసర పుణ్యక్షేత్రాలు, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయం, గంగా హారతి, అయోధ్యలోని రామ జన్మభూమి, హనుమాన్‌ గర్హి, ప్రయోగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమ సందర్శన ఉంటుంది. తెలంగాణలోని కాజీపేట జంక్షన్‌, వరంగల్లు, ఖమ్మం, ఆంధ్రలోని విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్‌, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్‌లలో బోర్డింగ్‌/డీబోర్డింగ్‌ సదుపాయం కల్పించారు. ఈ యాత్రలో ఆన్‌బోర్డు/ఆఫ్‌బోర్డులో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అల్పాహారం, భోజనం, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు మార్గంలో రవాణా సదుపాయం, రాత్రుళ్లు హోటళ్లలో బస తదితర ఏర్పాట్లతో పాటు కోచ్‌లలో సీసీ కెమెరాలతో నిరంతరం భద్రత ఏర్పాట్లు, టూర్‌ ఎస్కార్టులు అందుబాటులో ఉంటారని తెలిపారు.

ప్యాకేజీ ధరలు…
ఈ యాత్రలో ఎకానమి (స్లీపర్‌ క్లాస్‌) పెద్దలకు ఒక్కొక్కరికి రూ.17,000, పిల్లలకు రూ.15,800, స్టాండర్డ్‌ (3 ఏసీ)లో పెద్దలకు రూ.26,700, పిల్లలకు రూ.25,400, కంఫర్ట్‌ (2 ఏసీ) పెద్దలకు రూ.35,000, పిల్లలకు రూ.33,300 టికెట్‌ ధర నిర్ణయించారు. ఆసక్తి కలిగిన వారు ఆర్‌ఆర్‌సీటీసీ వెబ్‌ సైట్‌ లేదా 9701360701, 9281030712 ఫోన్‌ నంబర్‌ల ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవాల్సిందిగా సూచించారు.