ArticlesNews

మట్టి గణపయ్యలే మేలు

229views

మట్టి గణనాథులను తయారు చేస్తూ వారంతా పర్యావరణ ప్రేమికులుగా మన్ననలు అందుకుంటున్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం సమీపంలో విగ్రహాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. గత కొన్నేళ్లుగా మట్టి గణనాథులను తయారీ చేస్తున్నారు. కండ్రికగూడెం గ్రామానికి చెందిన నాగవరపు సీతారాముడు ఆధ్వర్యంలో ఈ మట్టి గణనాథులను తయారు చేస్తున్నారు. కేవలం కలప చెక్కలు, ఎండు గడ్డి, జిగురుమట్టిని బొమ్మల తయారీలో ఉపయోగిస్తూ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

తయారీలో యువత
ప్రారంభంలో సీతారాముడు ఈ తయారీని ప్రారంభించారు. అనంతరం బృందంగా ఏర్పడ్డ యువకులు అంబటి రాజారావు, కలిదిండి పద్మ, పొన్నపల్లి సాయికుమార్‌, అంబటి యశ్వంత్‌, పొన్నపల్లి సూర్యతేజలు చేరి విగ్రహాల తయారీలో సహకరిస్తూ మట్టి గణనాథులను తయారు చేస్తున్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలతో పోల్చితే మట్టి గణనాధుల విగ్రహాలు శ్రమతో కూడుకున్నవని.. సమయం కూడా ఎక్కువ పడుతుందని సీతారాముడు తెలిపారు. ఇటుక బట్టి నిర్వాహకులైన వీరంతా గణపతి నవరాత్రుల సీజన్‌లో సాధారణ శిల్పులుగా మారి గణనాథుల విగ్రహాల తయారీని ప్రారంభించారు.

మట్టి గణనాథుల్ని తయారుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వైనం
పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తున్న యువత ఆదర్శాన్ని గుర్తించి మట్టి విగ్రహాలను తయారు చేసుకోవడానికి నా వంతు సాయంగా .. నాపొలంలోని స్థలాన్ని, గోడౌన్‌ను ఉచితంగా ఇచ్చాను. ఆరు సంవత్సరాలుగా వారు ఈ పని చేస్తున్నారు.– పాలమోలు శ్రీనివాస్‌, రైతు, కండ్రికగూడెం

ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల మాదిరిగానే మట్టి గణనాథుల విగ్రహాలు ఊరేగింపుకి అనువైన విధంగా తయారు చేస్తున్నాం. పర్యావరణంపై ఉన్న అవగాహనతో ఎక్కడా శిక్షణ తీసుకోకుండానే మట్టి విగ్రహాల తయారీ ప్రారంభించాను.– నాగవరపు సీతారాముడు, ప్రధాన శిల్పి, కండ్రికగూడెం