News

భారత్‌కు చైనా మంత్రి.. ఎందుకంటే..

192views

రెండు పొరుగు దేశాల మధ్య దీర్ఘ కాలంగా ఉన్న సరిహద్దు సమస్యపై చర్చించేందుకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్‌లో పర్యటించనున్నారు. అందులో భాగంగా సోమవారం ఆయన భారత్‌ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఆయన వేర్వేరుగా సమావేశం కానున్నారు. తూర్పు లడాఖ్‌లో 2020 సరిహద్దు ప్రతిష్టంభన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగు పరిచేందుకు ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

అదీకాక.. వచ్చే నెలలో చైనాలోని టియాంజిన్‌ వేదికగా షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. అలాంటి వేళ.. చైనా విదేశాంగ మంత్రి భారత్ పర్యటనకు రావడం పట్ల సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది. మరోవైపు పోలిటికల్ బ్యూరో ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) సెంట్రల్ కమిటీలో వాంగ్ యీ సభ్యునిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా చైనా ప్రత్యేక ప్రతినిధి హోదాలో ఆయన సరిహద్దు అంశాలపై చర్చించనున్నారు.

ఆ క్రమంలో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్‌లో సమావేశం కానున్నారు. అలాగే దైపాక్షిక చర్చల్లో భాగంగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో వాంగ్ యీ భేటీ కానున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆహ్వానం మేరకు వాంగ్ యీ.. ఆగస్ట్ 18 నుంచి 20వ తేదీ వరకు భారత్‌లో పర్యటించనున్నారని స్పష్టం చేసింది. భారత్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పర్యటనతో ఇరుదేశాల మధ్య సరిహద్దులకు సంబంధించిన అంశాలు సరళీకృతమవుతాయని వాదన సర్వత్ర వినిపిస్తోంది.