News

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ లో రాధా-కృష్ణుల మనోహరమైన రూపం

215views

దేశవ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇస్కాన్ టెంపుల్స్ కు భక్తులు పోటెత్తారు. చిన్న పిల్లలు శ్రీకృష్ణుడి,గోపిక వేషాధారణలో మంత్ర ముగ్ధులను చేస్తున్నారు. భక్తులు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ లో రాధా-కృష్ణుల మనోహరమైన రూపం భక్తులకు కనువిందు చేసింది. శ్రీ కృష్ణుడు, రాధా విలువైన ఆభరణాలతో అలంకరించబడ్డారు. రాధా-కృష్ణుల విగ్రహంలో కనిపించే ఆభరణాలు కోట్ల విలువైనవి. బంగారు కిరీటం, వజ్రాలు పొదిగిన.. రూ. 110 కోట్ల విలువైన ఆభరణాలతో అలంకరించబడ్డారు రాధా-కృష్ణులు. 105 సంవత్సరాల పురాతనమైన గోపాల్ మందిరం గ్వాలియర్‌లోని ఫూల్‌బాగ్‌లో ఉంది.

గోపాల్ మందిరంలో రాధా-కృష్ణుల అందమైన తెల్లని పాలరాయి విగ్రహాన్ని ప్రతిష్టించారు. జన్మాష్టమి శుభ సందర్భంగా, ఈ విగ్రహాలను కొత్త బట్టలు, ఆభరణాలతో అలంకరించారు. రాధా కృష్ణులను రూ.110 కోట్ల విలువైన ఆభరణాలతో అలంకరించారు. రాధా-కృష్ణుల దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఆభరణాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆభరణాలను సెంట్రల్ బ్యాంక్ లాకర్‌లో ఉంచారు. జన్మాష్టమి సందర్భంగా, గ్వాలియర్ మేయర్ నేతృత్వంలోని కమిటీ సెంట్రల్ బ్యాంక్ నుంచి ఆభరణాలను తీసుకొచ్చి రాధా-కృష్ణులను అలంకరించారు.

ఈ రాధా-కృష్ణుల విగ్రహాన్ని పటిష్టమైన భద్రతలో ఉంచారు. విగ్రహాన్ని పర్యవేక్షించడానికి 200 మంది పోలీసులు, CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఆభరణాలను 1921లో అప్పటి సింధియా రాష్ట్ర మహారాజు మాధవరావు సింధియా తయారు చేయించారు. వీటి విలువ దాదాపు రూ.110 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. 110 కోట్ల విలువైన ఆభరణాల జాబితాలో తెల్ల ముత్యాలతో కూడిన పంచగధి హారము (ఐదు ముత్యాల హారము), ఏడు తీగల హారము, బంగారు తోరాలు, బంగారు కిరీటం, వజ్రాలు పొదిగిన కంకణాలు, వజ్రం, బంగారు వేణువు, 249 స్వచ్ఛమైన ముత్యాల హారము, పుష్పరాగము, రూబీ పొదిగిన 3 కిలోల కిరీటం, బంగారు ముక్కు పుడక ఉన్నాయి.