News

జరిస్కి సమస్య ఛేదన.. ప్రతిష్ఠాత్మక ‘రామానుజన్ ప్రైజ్’ సొంతం!

202views

గణిత శాస్త్రంలో 70 సంవత్సరాలుగా ప్రపంచానికి మిస్టరీగా ఉన్న అత్యంత క్లిష్టమైన “జరిస్కి క్యాన్సిలేషన్ ప్రాబ్లెం”కు పరిష్కారం చూపి, భారత గణిత ప్రతిభను ప్రపంచానికి చాటిన మహిళ ప్రొఫెసర్ నీనా గుప్తా. ఈ గణనీయమైన కృషికి గాను ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన “రామానుజన్ ప్రైజ్” లభించింది. అయితే దురదృష్టవశాత్తు, ఇంత గొప్ప విజయాన్ని సాధించినప్పటికీ భారతీయ ప్రధాన మీడియా లేదా సోషల్ మీడియాలో ఆమె గురించి పెద్దగా తెలపకపోవడమే. నిజానికి మన సమాజం మిస్ యూనివర్స్ లాంటి విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టి, ఇలాంటి శాస్త్రీయ విజయాలను విస్మరించడం బాధాకరం. ఇలాంటి విజయాలే మన పిల్లలకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తినిస్తాయి.

ఇకపోతే నీనా గుప్తా 2006లో కోల్‌కతాలోని బెతున్ కళాశాలలో గణిత శాస్త్రంలో ఆనర్స్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్-ISI నుండి పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, బీజగణిత జ్యామితిలో PhD చేశారు. ఆ తర్వాత 2014లో ఆమె జరిస్కి క్యాన్సిలేషన్ ప్రాబ్లెం పై తన మొదటి పరిశోధన పత్రాన్ని ప్రచురించారు. ఈ పత్రం గణిత శాస్త్రవేత్తల మధ్య విస్తృతంగా గుర్తింపు పొందింది. ఇదే విజయంతో ఆమెకు అనేక అవార్డులు లభించాయి.

2014లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ నుండి ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డు దక్కింది. ఆ తర్వాత 35 సంవత్సరాల వయసులో అంటే 2019లో శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ అందుకున్న అతి పిన్న వయస్కులలో ఒకరుగా పేరు పొందారు. ఇక ఆ తర్వాత 2021లో ప్రతిష్ఠాత్మక ‘రామానుజన్ ప్రైజ్’ని అందుకున్నారు.

రామానుజన్ ప్రైజ్ ప్రాముఖ్యత విషయానికి వస్తే.. భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ పేరు మీద 2005లో ప్రారంభమైన ఈ బహుమతి.. అబ్దుస్ సలాం ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరీటికల్ ఫిజిక్స్-ICTP, భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ-DST, ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్-IMU కలిసి అందజేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా గణిత శాస్త్రంలో విశిష్ట కృషి చేసిన వారికి ఇది అత్యున్నత గౌరవం. ప్రొఫెసర్ నీనా గుప్తా విజయం కేవలం వ్యక్తిగత సాధన మాత్రమే కాదు.. ఇది భారతీయ గణిత ప్రతిభకు ఒక ప్రతీక. ఇలాంటి విజయాలను మనం గుర్తించి, ప్రచారం చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిని అందించాలి.