
182views
తిరుపతి గ్రామీణ మండలం పేరూరులో ఒబెరాయ్ గ్రూపునకు చెందిన ముంతాజ్ హోటల్కు వైకాపా ప్రభుత్వం చేసిన 20 ఎకరాల భూ కేటాయింపును కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఆధ్యాత్మిక ప్రాంతం తిరుపతిలో ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణంపై ధార్మిక సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేసినా అప్పట్లో పట్టించుకోలేదు. 2024 నవంబరు 18న నిర్వహించిన తితిదే పాలకవర్గ సమావేశంలో ఒబెరాయ్ గ్రూపునకు తిరుపతి గ్రామీణ మండలంలో భూ కేటాయింపులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ప్రజలు, ధార్మిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. భూ కేటాయింపులపై హైకోర్టులోనూ కేసు పెండింగ్లో ఉంది. వీటన్నిటిని దృష్ట్యా భూ కేటాయింపులు రద్దు చేస్తూ పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.




