ArticlesNews

ధర్మమార్గం

299views

ఏ ఆలయానికి వెళ్లినా అక్కడి గోడల మీద ‘ధర్మోరక్షతి రక్షితః’ అన్న మాటలను చూస్తాం. కానీ ధర్మమార్గాన్ని నిక్కచ్చిగా అనుసరిస్తున్నామా అంటే.. ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. అంతులేని కోరికలను తీర్చుకోడానికి దైవాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని చూస్తారు చాలామంది. అలాంటి వారి పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు… అన్నీ కోరికల సాధనలో భాగమే. దేవాలయ సందర్శన కానీ, మొక్కులు మొక్కడం కానీ అన్నింటా భగవంతుణ్ని తమ కోరికలు తీర్చే ఒక కల్పవృక్షంగా భావిస్తారు తప్ప ధర్మమే దైవం అన్న విషయాన్ని మరిచిపోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం తప్పకూడదు అన్న స్థిర నిర్ణయాన్ని తీసుకోరు.

తమకు తోచిందే ధర్మంగా భావించడం, తమకు లాభం కలిగించేదే ధర్మం అని స్వార్థబుద్ధితో ఆలోచించడం మామూలైపోయింది. స్వార్థమే ధర్మం అని మనం అనుకున్నా ఎప్పుడూ అది విజయం సాధించలేదు సరికదా, ఏదో ఒకరోజు మనల్ని అధఃపాతాళానికి అణగదొక్కేస్తుంది. పరకాంతను ఆశించడం అధర్మమని తెలిసీ, సీతను అపహరించి తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నాడు రావణుడు. కానీ ఆయన తమ్ముడు విభీషణుడు ధర్మాన్ని నమ్ముకుని చరితార్థుడయ్యాడు. విభీషణుడు ఒకసారి బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమై ‘ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. విభీషణుడు అప్పుడు తనకు రాజ్యం కావాలని కోరి ఉండవచ్చు. మరేదైనా గొంతెమ్మ కోరిక కోరి ఉండవచ్చు. వాటిని తీర్చుకుని ఆనందం అనుభవించి ఉండవచ్చు. కానీ ఆయన అవేవీ కోరలేదు. సాక్షాత్తూ ఆ బ్రహ్మే ఆశ్చర్యపోయేలా, ‘ఎప్పుడూ నాయందు ధర్మబుద్ధి స్థిరంగా ఉండేటట్టు చూడు. నేను నా కార్యాలన్నింటినీ ధర్మబద్ధంగా నిర్వహించేటట్టు చూడు’ అని వరం కోరాడు.

ధర్మాన్ని అనుసరించేవాడు కాబట్టే సొంత అన్న పరకాంతను చెరబట్టినపుడు, అది చేయతగనిదని వాదించాడు విభీషణుడు. ఆ మాటను పెడచెవిన పెట్టి ధర్మాచరణకు దూరమైన రావణుడు హతమయ్యాడు. ఎటువంటి కోరికలు లేనివాడు, ఎప్పుడూ ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు అయిన విభీషణుడు- ధర్మస్వరూపుడు, దైవస్వరూపుడు అయిన రామచంద్రుడికి నేస్తం అయ్యాడు. ఆయన అనుగ్రహంతో రాజయ్యాడు. ధర్మాన్ని నమ్ముకున్నందుకు లభించిన అద్భుత ఫలితం అది. అంతులేని కోరికలతో, తాపత్రయాలతో నిత్యం అధర్మ మార్గంలో పయనిస్తూ ఉండేవారు కాలగర్భంలో కలిసిపోతారు. ధర్మమార్గాన్ని అనుసరించేవారు జీవించినంత కాలం ప్రశాంతతతో బతుకుతూ మరణానంతరం కూడా తమ యశోశరీరంతో ఈ భూలోకంలో ప్రశంసలందుకుంటున్నారు. అందుకు విరుద్ధంగా అత్యాశ, భోగలాలసత్వాలకు దాసులైనవారు నిరంతరం చింతలతో సతమతమై, అనారోగ్యాలపాలవుతున్నారు. బతికి ఉండగానే అందరి నుంచి దూషణ భూషణ తిరస్కారాలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ధర్మమార్గాన్ని అనుసరిస్తూ చరితార్థులవడమే సర్వోత్తమమైన మార్గం.