
ఆగ్రా , బలరాంపూర్ తర్వాత , ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ జిల్లాలో ఒక పెద్ద అక్రమ మతమార్పిడి ముఠా బయటపడింది. నిఘావర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఈ ముఠా ఇప్పటివరకు 97 మంది మహిళలను ఆకర్షించినట్లు అనుమానిస్తున్నారు. వారందరూ ఇప్పడు కనిపించడం లేదు. ఈ కేసు చాలా సున్నితమైనది కావడంతో, ఈ విషయాన్ని లోతుగా దర్యాప్తు చేయడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఆగ్రాలో ఉమర్ గౌతమ్ అరెస్టు తర్వాత కేసు తీవ్ర మలుపు తిరిగింది. గౌతమ్ను విచారించగా , ఇస్లామిక్ మతమార్పిడి నెట్వర్క్ గురించి సమాచారం వెల్లడించాడు ఎందుకంటే అతని ‘జాబితా’లో అలీఘర్ నుండి కూడా పేర్లు ఉన్నాయి. జిల్లాలో తప్పిపోయిన మహిళలపై 97 కేసులు నమోదయ్యాయి. దాంతో పోలీసులు ఈ మిస్సింగ్ కేసులను వారందరూ మతమార్పిడి చేయబడ్డారా అనే కొత్త కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మార్చి 2025లో, అలీఘర్లోని సదర్ పోలీస్ స్టేషన్ నుండి ఇద్దరు అక్కాచెల్లెల్లు అదృశ్యమయ్యారు.వారిలో ఒకరు AK-47 రైఫిల్ పట్టుకుని ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ విషయంపై తగిన విచారణ చేపట్టగా వారిద్దరూ అక్రమ మతమార్పిడి నెట్వర్క్తో సంబంధం కలిగి ఉందని తేలింది.ఆ అక్క చెల్లెల్లను బలవంతంగా మతమార్పిడి చేసి, ఆపై కోల్కతాలోని ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఉంచారని ఆ వర్గాలు చెబుతున్నాయి.
ఆ ముఠా ఎలా పనిచేసింది
పోలీసు దర్యాప్తులో ఈ ముఠా హిందూ మహిళలను ఆకర్షించడానికి సోషల్ నెట్వర్క్లు, డార్క్ వెబ్సైట్లు డేటింగ్ అప్లికేషన్లను ఉపయోగించిందని తేలింది. ఈ సభ్యులు మొదట్లో మహిళలతో స్నేహం చేసి, వారిని ప్రేమలో పడేసి, ఆపై వారిని బలవంతంగానో, బెదిరించో మతం మారేలా చేస్తారు, ఈ కేసులో పోలీసులు రహస్యంగా ఇన్వెస్టిగేషన్ ను నిర్వహిస్తున్నారు. ఈ బృందానికి PFI, SIMI, లష్కరే తోయిబా వంటి నిషేధిత ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు పోలీసులు. కెనడా, US, UK దుబాయ్ వంటి దేశాల నుండి విదేశీ నిధులు కూడా అందుతున్నట్లు వారు చెబుతున్నారు.
ఈ కేసు విషయమై ఉత్తరప్రదేశ్ డీజీపీ రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ ఈ ముఠా వివిధ రాష్ట్రాల్లో వందలాది మంది హిందూ మహిళలను మతం మార్చగలిగిందని వివరించారు. ఆగ్రా మతమార్పిడి కేసులో అరెస్టయిన వ్యక్తులు ఆయేషా (ఒడిశాకు చెందిన అసలు పేరు ఎస్బీ కృష్ణ), కోల్కతాకు చెందిన అలీ హసన్ అలియాస్ శేఖర్ రాయ్ జైపూర్కు చెందిన మహ్మద్ అలీ. ఆయేషా ఈ గ్రూపుకు విదేశీ నిధులు ఆర్థిక సహాయం అందించిందని, హసన్ ప్రభావవంతమైన పరిచయాలను ఏర్పరచుకునేలా చూసుకున్నట్లు తెలుస్తోంది.
అలీఘర్లో 97 మంది మహిళలు అదృశ్యం
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అలీఘర్ తో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కనీసం 97 మంది మహిళలు కనిపించకుండా పోయారు, వీరిలో ఎక్కువ మంది ఈ మతమార్పిడి ముఠా బాధితులని తేలింది. కొన్ని సందర్భాల్లో, మహిళలను తప్పుదారి పట్టించడం లేదా బలవంతంగా మతం మార్చడం జరిగింది, వారిలో కొందరికి ముస్లింలతో బలవంతంగా వివాహాలు కూడా చేయించారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం “మిషన్ అస్మిత”
దీనికి ప్రతిస్పందనగా, యూపీ గవర్నమెంట్ బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా “మిషన్ అస్మిత” అనే ప్రత్యేక మిషన్ ను ప్రారంభించింది. దీనిలో భాగంగా, ఆగ్రా పోలీసుల ఏడు ప్రత్యేక బృందాలు కోల్కతా, జమ్మూ & కాశ్మీర్, గోవా, రాజస్థాన్, ఢిల్లీ ,ఉత్తరాఖండ్లలో గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఒక మహిళతో సహా 10 మంది నిందితులను అరెస్టు చేశారు. భారతీయ న్యాయ సంహిత ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం, 2021లోని అనేక సెక్షన్ల కింద నేరస్థులపై కేసులు నమోదు చేశారు. ఇంకా మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.




