
ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్కు చెందిన కొంతమంది మైనర్లను అదుపులోకి తీసుకొని జైళ్లలో పెట్టారని పేర్కొంటూ దాఖలైన పిటిషన్పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీనిపై జమ్మూకశ్మీర్ హైకోర్టు జువినైల్ జస్టిస్ కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్లో మైనర్లను అదుపులోకి తీసుకున్నారంటూ ఇనాక్షీ గంగూలీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ కమిటీని ఏర్పాటు చేసింది. నేడు కమిటీ సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం సరైందేనంటూ స్పష్టం చేసింది.

ఇనాక్షి గంగూలీ
జమ్మూకశ్మీర్లోని అన్ని జైళ్లను కమిటీ సందర్శించిందని.. ఏ జైలులో కూడా మైనర్లు లేరని కమిటీ నివేదికలో తెలిపిందంటూ ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ కమిటీ సమర్పించిన నివేదికపై స్పందించేందుకు పిటిషనర్కు కొంత సమయం ఇవ్వాలంటూ కోరారు. జమ్మూ కాశ్మీర్లో మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నట్లయితే సంబంధిత ఫోరంను సంప్రదించేందుకు పిటిషనర్లకు ధర్మాసనం పూర్తి స్వేచ్ఛనిచ్చింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





