News

గురుపూర్ణిమ సందర్భంగా.. జగద్గురు బాలక్ దేవాచార్యకు హారతి ఇచ్చిన ముస్లిం మహిళలు

254views

గురుపూర్ణిమ వేడుకలో ముస్లింలు కూడా పాల్గొన్నారు. బురఖా ధరించిన ముస్లిం మహిళలు జగద్గురు బాలక్ దేవాచార్య మహారాజ్‌కు హిందూ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఆయనకు తిలకం అద్దడంతోపాటు హారతి ఇచ్చారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ సంఘటన జరిగింది. గురువారం గురుపూర్ణిమ సందర్భంగా రామనంది శాఖకు చెందిన పురాతన పాతాళపురి మఠాధిపతి జగద్గురు బాలక్ దేవాచార్య మహారాజ్‌కు హిందువులతోపాటు ముస్లింలు స్వాగతం పలికారు. రాముడి పేరున్న వస్త్రం కప్పి సత్కరించారు. బురఖా ధరించిన ముస్లిం మహిళలు ఆయనకు తిలకం అద్దడంతోపాటు హారతి ఇచ్చారు. ఆయన ఆశీస్సులు పొందారు. సాంస్కృతిక, మత సామరస్యాన్ని చాటారు.

కాగా, గురుపూర్ణిమ సందర్భంగా జగద్గురు బాలక్ దేవాచార్య మహారాజ్‌ భక్తులకు సందేశం ఇచ్చారు. నిజమైన శిష్యరికం సారాంశం సమాజానికి సేవ చేయడం, దేశం కోసం జీవించడం, ఐక్యతను నిలబెట్టడంలో ఉందని అన్నారు. రాముని మార్గం కరుణ, శాంతిని పెంపొందించే సాంస్కృతిక పునరుజ్జీవనమని తెలిపారు. ‘భారతదేశంలోని ప్రతి వ్యక్తి , డీఎన్‌ఏ, పూర్వీకులు, సంస్కృతి ద్వారా ఐక్యంగా ఉన్నారు. ఎలాంటి విభజనలు లేవు. రామపంత్ (రాముని మార్గానికి) అందరికీ స్వాగతం’ అని అన్నారు.

కాగా, జగద్గురు బాలక్ దేవాచార్య మహారాజ్‌కు ముస్లిం మహిళలు హారతి ఇచ్చిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.