
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షల్లో హిస్టరీ ప్రశ్న పత్రంలో ఫ్రీడమ్ ఫైటర్స్ను అవమానించేలా ఓ ప్రశ్న అడిగారు. స్వాతంత్య్ర సమరయోధులను ఆ ప్రశ్నలో ఉగ్రవాదులుగా పేర్కొన్నారు. దీనిపై బెంగాల్లోని ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. తృణమూల్ సర్కారు ఫ్రీడమ్ ఫైటర్స్ను అవమానించిందని బీజేపీ నాయకుడు, ప్రతిపక్ష నేత సువేంధు అధికారి మండిపడ్డారు.
పశ్చిమ మిడ్నాపూర్లోని విద్యాసాగర్ యూనివర్సిటీ మరోసారి స్వాతంత్య్ర సమరయోధులను అవమానించేలా ప్రశ్న ఇచ్చిందని సువేందు విమర్శించారు. ఈ మేరకు ఆ ప్రశ్నపత్రాన్ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో.. ‘స్వాతంత్య్ర సమరయోధుల దాడిలో మరణించిన ముగ్గురు మిడ్నాపూర్ జిల్లా మెజిస్ట్రేట్ల పేర్లను తెలుపండి’ అని అడగడానికి బదులుగా.. ‘తిరుగుబాటుదారుల/ఉగ్రవాదుల దాడిలో మరణించిన ముగ్గురు మిడ్నాపూర్ జిల్లా మెజిస్టేట్ల పేర్లను తెలుపండి’ అని అడిగారు.
అయితే ఈ ప్రశ్నపై యూనివర్సిటీ వీసీ దీపక్ కుమార్ కౌర్ స్పందించారు. టైపికల్ తప్పదం వల్ల తప్పుడు ప్రశ్న వచ్చిందని తెలిపారు. అయితే జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన విషయం కావడంతో తాము దీన్ని తేలిగ్గా తీసుకోవడం లేదని అన్నారు. ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ నుంచి తాను నివేదిక కోరానని, దాని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటానని చెప్పారు.





