News

మురుగ భక్తర్గళ్ మానాడు

210views

జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ని బీజేపీ తమిళనాడు అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్ హిందూ మున్నాని సంస్థ ఈ నెల 22వ తేదీన మధురైలో నిర్వహించనున్న మురుగ భక్తర్గళ్ మానాడు (సమ్మేళనం)కి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో నాగేంద్రన్ తో పాటు బీజేపీ నాయకులతో కూడిన బృందం పవన్ కల్యాణ్ తో భేటీ అయింది. ఈ సందర్భంగా మధురైలో నిర్వహించే మురుగన్ భక్తుల సమ్మేళనానికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నీ ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు తెలిపారు. తమిళనాడులో ఆరు ముఖ్య షణ్ముఖ క్షేత్రాలు కొలువైన క్రమంలో అక్కడ చేపడుతున్న ఈ సమ్మేళనం ఆధ్యాత్మికంగా, సనాతన ధర్మ పరిరక్షణపరంగా ఎంతో ప్రత్యేకమైనదని, ఈ కార్యక్రమంలో ముఖ్యోపన్యాసం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో వర్తమాన రాజకీయ పరిణామాలపైనా, పలు అంశాల గురించీ చర్చించారు. ఈ భేటీలో బీజేపీ తమిళనాడు వ్యవహారాల ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ తమిళనాడు నేతలు ఎం.చక్రవర్తి, ఎస్.అమరప్రసాద్ రెడ్డి, ఆ రాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు కె.ఎస్.రాధాకృష్ణన్ పాల్గొన్నారు.