
తెలుగు భాషను దశదిశలా చాటిన ఘనుడు శ్రీకృష్ణదేవరాయలు అని రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు అన్నారు. కృష్ణాజిల్లా శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయలు మహోత్సవం నిర్వహించారు. జస్టిస్ దుర్గాప్రసాదరావు జ్యోతి వెలిగించి చేసి రాయలు మహోత్సవాన్ని ప్రారంభించారు. మొదట శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి నివాళుర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాయలు తన పాలనాకాలంలో సాహిత్యం, సంస్కృతికి పెద్దపీట వేశారన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాష వైభవం, సంస్కృతులను కాపాడుకోవాలన్నారు.
కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచంద్ మాట్లాడుతూ ఆంధ్రభాషకు దేవుడు ఆంధ్ర మహావిష్ణువు అని, శ్రీకాకుళం ఆంధ్రులకు తొలి రాజధానిగా వెలుగొందడం గొప్ప విశేషమన్నారు. మొదట గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఏసీ దాసరి శ్రీరామవరప్రసాద్, అవనిగడ్డ నియోజకవర్గ ప్రత్యేక అధికారి పి.సాయిబాబు, తహసీల్దారు విజయప్రసాద్, ఎంపీడీవో సుబ్బారావు, కూటమి నాయకులు మండలి రాజా, తుమ్మల చౌదరిబాబు, చిన్నా, రవిప్రసాద్, కుమార్రాజా, కనకదుర్గ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు కళాబృందం ప్రదర్శించిన ‘గోదా కల్యాణం’ కూచిపూడి నృత్య రూపకం అలరించింది.




