
పహల్గాంలో అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోన్న పాకిస్థాన్కు గట్టిగా బదులు చెప్పింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈ ‘ఆపరేషన్ సిందూర్ లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు ఆపరేషన్ వివరాలను గురువారం ఆయన అఖిలపక్షానికి తెలియజేశారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
‘ఆపరేషన్ సిందూర్’ గురించి వివరించేందుకు కేంద్రం గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘తొమ్మిది ఉగ్ర స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు నిర్వహించాం. దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుందన్న ఈ ఆపరేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేం. ఈ ఉద్రిక్తతలను పెంచాలన్న ఉద్దేశం మాకు లేదు. కానీ, పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం.. వెనక్కి తగ్గేదే లేదు. ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతుంది’’ అని వెల్లడించారు.
రాజకీయాలకు తావులేదు: కిరణ్ రిజిజు
సమావేశం అనంతరం కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. ‘‘ఆపరేషన్ సిందూర్ వివరాలు, ప్రభుత్వ ఉద్దేశాలను రక్షణమంత్రి ప్రతిపక్ష నేతలకు వివరించారు. అయితే, ఇది కొనసాగుతున్న ఆపరేషన్ గనుక.. సాంకేతిక అంశాలను ఆయన వెల్లడించలేకపోయారు. ప్రతిపక్షాలు అత్యంత పరిణతితో వ్యవహరించాయి. ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ అంశంలో రాజకీయాలకు తావులేదు’’ అని రిజిజు వెల్లడించారు.





