
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో రైతు వేగుళ్ల మురళీకృష్ణకు చెందిన ఒంగోలు ఆవు ఒక్కరోజులో 21.19 కిలోల (20.56 లీటర్లు) పాలు ఇచ్చి సరికొత్త రికార్డు సాధించినట్లు కేంద్రీయ పశు నమోదు పథకం ప్రతినిధి డి.రాజేశ్వరరావు తెలిపారు. పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్లో… ఉదయం, సాయంత్రం పాల దిగుబడి వివరాలను నమోదు చేసినట్లు తెలిపారు. ఆవు సోమవారం వరకు రోజుకు 18 కిలోల పాలు ఇచ్చేదని చెప్పారు. మంగళవారం 21.19 కిలోల (ఉదయం 11.52, సాయంత్రం 9.67) పాలు ఇచ్చిందని వివరించారు. ఐదేళ్ల వయసు గల గోవు 2023లో తాడేపల్లిగూడెంలో నిర్వహించిన దేశీయ ఆవు పాల పోటీలో పూటకు 7.17 కిలోలు ఇచ్చి ప్రథమ బహుమతి సాధించిందన్నారు. పోషక విలువల దాణా, పచ్చగడ్డి ఇవ్వడంతో అధిక పాల దిగుబడి సాధ్యమైందని మండపేటలోని రాష్ట్ర పశు సంవర్ధక శిక్షణ కేంద్రం సంయుక్త సంచాలకుడు వెంకటేశ్వరరావు తెలిపారు.