
పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులు గర్వించదగ్గ విషయమని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురుచూసిందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రక్షణ దళాలు దీటుగా పాక్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి బుద్ధి చెప్పాయన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు. మోదీ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామన్నారు.
‘‘పహల్గాంలో హిందువులా?కాదా? అని అడిగి మరీ ఉగ్రవాదులు చంపారు. దేశం మొత్తం పుట్టెడు దుఃఖంలో ఉంది. మోదీ నాయకత్వంలో ఉగ్రవాదంపై యుద్ధం జరుగుతోంది. ఈ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల అందరం గర్వించాలి.. అండగా నిలవాలి. చివరి ఉగ్రవాదిని అంతం చేసేవరకు ఆయన పోరాటం ఆగదు. పాకిస్థాన్కు మద్దతుగా ఆలోచించే నాయకులు తమ వైఖరి మార్చుకోవాలి. భారత సైన్యాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని పవన్ అన్నారు.





