
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ సరిహద్దుల్లో భారత సైనికులపై కాల్పులు జరపడంతో పాటు ఇతర కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడంపై కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. దాయాది దేశం ఇదే విధంగా సరిహద్దుల్లో సమస్యలు సృష్టిస్తూ..భారత వ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తే ప్రపంచపటం నుంచి దానిని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని పోషిస్తున్నందుకు పాక్పై భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక దౌత్యపరమైన చర్యలు తీసుకుందని..సరైన సమయంలో ఆ దేశానికి తగిన బుద్ధి చెబుతామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
హిమాచల్ ప్రదేశ్ భాజపా చీఫ్ రాజీవ్ బిందాల్ మాట్లాడుతూ..రాష్ట్రంలోని 17 చోట్ల నిరసనలు జరుగుతున్నాయని..కాబట్టి పాకిస్థానీయులను రాష్ట్రంలో ఉంచడం సరికాదని..కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం శిమ్లాలో నివసిస్తున్న పాకిస్థాన్ పౌరులను గుర్తించి వెంటనే వారిని తమ స్వదేశానికి పంపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు భాజపా నేతలు అక్కడి డిప్యూటీ కమిషనర్కు మెమోరాండం సమర్పించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పాక్ పౌరులను గుర్తించడానికి అక్కడి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని బిందాల్ విమర్శించారు.





