
దేశం విడిచి పారిపోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కుట్ర పన్నుతున్నారనే అభియోగంపై హసీనాతోపాటు మరో 72 మందిపై కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘‘ కుట్ర వ్యవహారంలో షేక్ హసీనాపై ఢాకా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు దీనిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) విచారణ ప్రారంభించింది.’’ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.
గతేడాది డిసెంబర్ 19న షేక్హసీనా ఆన్లైన్లో సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు సీఐడీకి స్పష్టమైన సమాచారం ఉంది. ‘‘ జాయ్ బంగ్లా బ్రిగేడ్’’ పేరుతో వ్యవస్థను ఏర్పాటుచేసి.. తద్వారా బంగ్లాలో మళ్లీ హసీనా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలన్నది ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు హసీనా కుట్ర పన్నుతున్నారంటూ సీఐడీ ఆమెపై కేసు నమోదు చేసింది. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఆగస్టు 5న దేశం వీడిన షేక్ హసీనా.. భారత్లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో హసీనాతోపాటు ఆమె మంత్రివర్గంలో ఉన్న నేతలు, సలహాదారులు, సైనికాధికారులపైనా నేరారోపణలు నమోదయ్యాయి. ఈక్రమంలో ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ -ICT ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసింది.





