News

మోహ‌న్‌లాల్‌కి మ‌ద్ద‌తుగా నిలిచిన జావేద్ అక్త‌ర్

299views

మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి ఆరోగ్యం బాగుండాల‌ని కాంక్షిస్తూ మరో అగ్ర నటుడు మోహన్‌లాల్‌ శబరిమల అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి కొన్ని హిందూ సంఘ‌లు వ్య‌తిరేకిస్తున్నారు. మమ్ముట్టి ఒక ముస్లిం వ్య‌క్తి. అత‌డికి హిందు ఆల‌యంలో పూజ‌లు చేయడమేంటని ఇలా చేసినందుకు మోహ‌న్‌లాల్‌కి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కొంద‌రూ డిమాండ్ చేస్తున్నారు. మ‌రోవైపు ఈ విష‌యంపై మోహ‌న్‌లాల్‌కి కొంద‌రు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. మమ్ముట్టి కోసం మోహన్‌లాల్ శబరిమలలో పూజ చేయించి మతసామరస్యం కోసం పాటుపడ్డారని ఒక వర్గం వారు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే ఈ వివాదం మ‌రింత ముదురుతుండ‌గా.. తాజాగా ఈ విష‌యంలో మోహ‌న్‌లాల్‌కి మ‌ద్ద‌తుగా నిలిచాడు బాలీవుడ్ దిగ్గ‌జ లిరిక్ రైట‌ర్ జావేద్ అక్త‌ర్. ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ.. “భారతదేశంలో ఉన్న ప్ర‌తి మమ్ముట్టి లాంటి వ్య‌క్తికి మోహ‌న్ లాల్ లాంటి స్నేహితుడు ఉండాలి. అలాగే మోహ‌న్ లాల్ లాంటి వ్య‌క్తికి మమ్ముట్టి లాంటి స్నేహితుడు ఉండాలి. వారి గొప్ప స్నేహం కొంతమంది త‌క్కువ‌గా.. సంకుచిత మ‌న‌స్త‌త్వంతో ఆలోచించే వ్య‌క్తుల‌కు అర్థం కాదు. అయిన ఈ విష‌యాన్ని ఎవ‌రు ప‌ట్టించుకుంటారంటూ” జావేద్ చెప్పుకోచ్చాడు.

అస‌లు ఏం జ‌రిగిందంటే.. మమ్ముట్టి ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల తన సినిమా ప్రమోషన్‌ కోసం శబరిమలకు వెళ్లిన మోహన్‌లాల్.. ఈ నెల 18న మమ్ముట్టి జన్మనామం, జన్మ నక్షత్రం పేరుతో అక్కడ పూజ చేయించారు. అయితే ఈ పూజకు సంబంధించిన రషీదు తాజాగా బయటపడింది. అది ఇంటర్నెట్‌లో చక్కెర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్‌లు ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. ఇదే విష‌యంపై మోహ‌న్ లాల్ కూడా స్పందిస్తూ.. పూజ అనేది తన వ్యక్తిగత విషయమని, ఈ విషయంలో ఇతరుల జోక్యం అనవసరమని వ్యాఖ్యానించారు.