News

కర్నాటక ముస్లిం కోటా బిల్లుపై రాజ్యసభలో రసాభాస

430views

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించడంపై రాజ్యసభలో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటకలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఆమోదించడాన్ని కేంద్ర మంత్రి నడ్డా,బీజేపీ ఎంపీలు ఖండించారు. కర్ణాటక ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నదంటూ ఆందోళనకు దిగారు.

దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు సమాధానం చెప్పాలంటూ రాజ్యసభలో జేపీ నడ్డా డిమాండ్‌ చేశారు. ఈ నేపధ్యంలో నెలకొన్న గందరగోళం మధ్య రాజ్యసభను రెండు గంటలకు వాయిదా పడింది. కర్నాటక ప్రభుత్వ టెండ‌ర్లలో ముస్లిం కాంట్రాక్టర్లకు నాలుగు శాతం కోటా ఇచ్చేందుకు ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. దీనిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇటువంటి బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని కర్నాటక బీజేపీ హెచ్చరించింది.

క‌ర్నాట‌క ట్రాన్స్‌ప‌రెన్సీ ఇన్ ప‌బ్లిక్ ప్రొక్యూర్మెంట్ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ తీసుకువచ్చి, కేట‌గిరీ 2బీ కింద రిజ‌ర్వేష‌న్ విధానాన్ని అమ‌లు చేయ‌నున్నట్లు సీఎం సిద్ధరామ‌య్య ప్రక‌టించారు. కేట‌గిరీ 2బీలో ముస్లిం కాంట్రాక్టర్లు ఉంటారని ఆయన తెలిపారు. కేట‌గిరీ వన్‌లో ఎస్సీ, ఎస్టీలు, క్యాట‌గిరీ 2ఏలో వెనుక‌బ‌డిన త‌రగ‌తులు వారు ఉంటారన్నారు. కేటీపీపీ చ‌ట్టం కింద ఇకపై ముస్లిం కాంట్రాక్టర్లు సుమారు రెండు కోట్ల మేరకు విలువ కలిగిన ప్రభుత్వ ప‌నులు చేసేందుకు అర్హులు కానున్నారు.