
అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. కొందరు దుండగులు భారతీయులకు వ్యతిరేకంగా రాతలు రాసి ఆలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆలయంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
కాలిఫోర్నియాలోని చినోహిల్స్ ప్రాంతంలో ఉన్న BAPS హిందూ దేవాలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో BAPS పబ్లిక్ అఫైర్స్ సభ్యుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా.. దక్షిణ కాలిఫోర్నియాలోని ఆలయం ప్రహరీ గోడలపై భారతీయులకు వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా రాతలు రాశారు. అనంతరం గట్టిగా నినాదాలు చేస్తూ ఆలయాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. భారత సమాజం ఎల్లప్పుడూ శాంతి కోరుకుంటోందని, ద్వేషానికి వ్యతిరేకంగా నిలుస్తుందన్నారు. మానవత్వానికి విలువ ఇచ్చి, ఎవరిపై తాము దాడులు చేసే ఉద్దేశం లేదని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. రణధీర్ ట్విట్టర్ వేదికగా..‘కాలిఫోర్నియాలో ఒక హిందూ ఆలయంలో జరిగిన విధ్వంసానికి సంబంధించిన నివేదికలను మేము చూశాము. ఇటువంటి నీచమైన చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. దేవాలయాలకు తగిన భద్రత కల్పించాలని కోరుతున్నాం’ అని చెప్పుకొచ్చారు.





