News

రాష్ట్రపతిపై సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు..మండిపడ్డ బీజేపీ

248views

రాష్ట్రపతి ద్రౌపదిముర్ముపై సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సోనియా,రాహుల్‌ పార్లమెంట్‌ ఆవరణలోకి వచ్చారు. అయితే ఇక్కడ రాహుల్‌గాంధీ మాత్రమే మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రపతి ప్రసంగం బోరింగ్‌గా ఉందని రాహుల్‌ అన్నారు. దీనికి సోనియా కల్పించుకుని ‘అన్నీ తప్పుడు హామీలే. రాష్ట్రపతి చివర్లో బాగా అలసిపోయారు. ఆమె అసలు మాట్లాడలేకపోయారు. పూర్‌ థింగ్‌’ అని అన్నారు. ఈ మాటలకు తల ఊపిన రాహుల్‌ రాష్ట్రపతి చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్పారన్నారు.

రాష్ట్రపతినుద్దేశించి సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై నేరుగా బీజేపీ ఖండించింది. ‘సోనియాగాంధీ వెంటనే రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పాలి. ఆమె మాటలు కాంగ్రెస్‌ పార్టీ గిరిజన,పేదల వ్యతిరేక వైఖరిని తెలియజేస్తోంది’అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఎక్స్‌(ట్విటర్‌)లో డిమాండ్‌ చేశారు.సోనియా వ్యాఖ్యలు రాష్ట్రపతి గౌరవాన్ని తగ్గిస్తున్నాయని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు.

కాగా, బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం(జనవరి31) పార్లమెంట్‌ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఎన్డీఏ మూడో టర్ములో పనులు గతం కంటే మూడు రెట్ల వేగంతో జరుగుతున్నాయన్నారు.