
ఖో ఖో ప్రపంచ కప్ విజేత పురుష, మహిళా జట్లలో భాగమైన ఇద్దరు కర్ణాటక ఆటగాళ్ళు, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ఇచ్చిన గౌరవం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ క్రమంలో రూ. 5 లక్షల నగదు బహుమతిని స్వీకరించడానికి నిరాకరించారు. రాష్ట్రంలో ఖో ఖో ప్రపంచ కప్ విజేతలను సీఎం సిద్ధరామయ్య ప్రత్యేకంగా సత్కరించి, వారి విజయాలను ప్రశంసించారు. కానీ ఆటగాళ్లు ఎం కె గౌతమ్, చైత్ర బి మాత్రం ఈ బహుమతి తగినంతగా లేదని భావించారు.
ఆ స్థాయి గౌరవం..
వారి అభిప్రాయం ప్రకారం ఈ నగదు బహుమతి వారిని క్రీడలో కొనసాగడానికి ప్రోత్సహించదన్నారు. అలాగే ఖో-ఖో క్రీడను కొనసాగించడానికి ఇతరులను ప్రేరేపించడంలో కూడా విఫలమవుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో గౌతమ్ మాట్లాడుతూ, “మా విజయాన్ని మరింత గౌరవంగా అంగీకరించాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్రలో విజేత జట్లకు రూ. 2.25 కోట్ల నగదు బహుమతి, ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించారు. కానీ కర్ణాటకలో మాత్రం ఆ స్థాయి గౌరవం లేదు,” అన్నారు.
నిరాశజనకంగా..
ఈ విషయం మీడియాతో పంచుకున్న గౌతమ్, “మేము అవార్డును తిరస్కరించడం ద్వారా ముఖ్యమంత్రిని అగౌరవపరచడం లేదు. కానీ మాకు దక్కాల్సిన గౌరవం లభించలేదు. కాబట్టి ఈ అవార్డును తిరస్కరిస్తున్నామని అన్నారు. మహారాష్ట్రలో ఇచ్చిన గౌరవాన్ని కర్ణాటక ప్రభుత్వంతో పోల్చారు. “మా రాష్ట్రంలో అలా చేయలేదు, కాబట్టి ఇది నిరాశజనకంగా ఉందన్నారు. ఈ విషయంలో సమీక్షించి, పొరుగు రాష్ట్ర మహారాష్ట్రలో ఇదే పరిస్థితిని గమనించి, కర్ణాటక ప్రభుత్వానికి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రోత్సాహాం కరవు..
ఇక చైత్ర కూడా ఈ వ్యవహారంపై నిరాశ వ్యక్తం చేశారు. “మేము కూడా ప్రపంచ కప్ గెలిచిన ఆటగాళ్లం. కానీ ఇతర క్రీడా జట్లకు ఇచ్చే మోతాదు మాకు అందించడం లేదు. రూ. 5 లక్షలు మాత్రమే ప్రకటించారు. ఈ పరిస్థితిలో క్రీడను కొనసాగించడానికి ఆలోచించడం కూడా కష్టమని చెప్పారు. ప్రభుత్వ స్పందనపై చైత్ర మాట్లాడుతూ, “ప్రభుత్వం మా గురించి ఆలోచించకపోతే, మనం ఎలా క్రీడను కొనసాగించగలమని ప్రశ్నించారు. ఇతర క్రీడల్లో మెడల్ సాధించినవారికి ఇచ్చే పథకాలు మాకు దొరకడం లేదు. ఇది మా దుస్థితి,” అని తెలిపారు.
గౌరవం అందించకపోవడం..
ప్రధాన మంత్రి మా సమస్యను అంగీకరించి, ‘చూద్దాం’ అని చెప్పారు. కానీ ఈ పరిస్థితిలో బహుమతి పెద్దగా అవసరం లేదని అన్నారు. ఈ అంశం ప్రస్తుతం క్రీడా రంగంలో పెద్ద చర్చకు దారి తీసింది. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వ విధానాలు, ఇతర క్రీడలపై తక్కువ దృష్టి పెట్టడం, ఆటగాళ్ళకు తగిన గౌరవం అందించకపోవడం వంటివి సమస్యలుగా నిలిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో క్రీడాకారులు తమ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి, మరిన్ని ప్రోత్సాహక చర్యలను ప్రభుత్వంతో పంచుకోవాలని కోరుతున్నారు. క్రీడలకు కావాల్సిన ప్రోత్సాహం, ప్రభుత్వం ఇవ్వాల్సిన న్యాయం కేవలం కర్ణాటకలోనే కాదు. ఇతర రాష్ట్రాలకు కూడా అవసరమని చెబుతున్నారు.





