News

1,100 మంది వేదాచార్యులతో సరయూ హారతి

244views

ఉత్తరప్రదేశ్‌ యోగి సర్కారు అక్టోబర్‌ 28 నుంచి 30 వరకు రామనగరి అయోధ్యలో దీపోత్సవం నిర్వహించనుంది. ఈ సందర్భంగా మొత్తం 25 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ఈ సందర్భంగా పలు కళాకారుల బృందాలు రామాయణంలోని వివిధ ఘట్టాల ఆధారంగా ప్రదర్శనలను నిర్వహించనున్నాయి.

ఈ దీపోత్సవ్‌కు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా హాజరుకానున్నారు. లక్ష్మణ్ ఖిలా ఘాట్ నుంచి నయా ఘాట్ వరకు 1100 మంది వేదాచార్యులతో సరయూ హారతి నిర్వహించి గిన్నిస్ రికార్డు నెలకొల్పుతామని యోగి ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. రామ్ కీ పైడీలో లక్షల దీపాల మధ్య భారీ వేదికపై కళాకారులచేత సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ దీపోత్సవంలో ఆరు దేశాలకు చెందిన కళాకారులు రాంలీలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా థాయ్‌లాండ్, కంబోడియా, ఇండోనేషియా, మయన్మార్, మలేషియా, నేపాల్‌కు చెందిన కళాకారులు తమ ప్రతిభను చాటనున్నారు. అలాగే కశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, చండీగఢ్, సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన కళాకారులు అయోధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.