తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యి వాడారన్న వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. జాతీయ స్థాయిలో దీనిపై చర్చ జరుగుతోంది. ఇటు ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపించిన ల్యాబ్ రిపోర్ట్స్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి.
దీంతో ప్రపంచ నలుమూలలకు చెందిన కోట్లాది మంది భక్తులు ఈ విషయమై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది మంది ఆరాధ్య దైవమైన వెంకటేశ్వరుడి తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని భక్తులు జీర్ణించుకోవడం కష్టంగా మారింది. దీనికి కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ సామాన్యులతో పాటు సెలబ్రిటీల వరకు కోరుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వెంటనే విచారణ జరపాల్సిందిగా బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడారు. తిరుమల ప్రసాదం లడ్డూపై సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ ఆరోపణలు భక్తులకు గందరగోళానికి గురి చేస్తున్నాయన్నారు. సమగ్ర విచారణ కోసం ఓ కమిటీని వేయాలని పిటిషన్లో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. నిజానిజాలు బయటకు రావాలనే ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.