నక్సల్స్ హింసను విడనాడి వెంటనే లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయుధాలు వీడి లొంగిపోవాలని, లేదంటే పూర్తి స్థాయిలో నక్సల్స్ నిర్మూలన ఆపరేషన్ ను ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. ఛత్తీ్సగఢ్కు చెందిన 55 మంది నక్సల్స్ హింస బాధితులను శుక్రవారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్షా మాట్లాడుతూ 2026, మార్చి 31 వరకు మాత్రమే మావోయిస్టులు తమ చివరి శ్వాస తీసుకోగలుగుతారని, అప్పటికి దేశంలో నక్సలిజం లేకుండా చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మాట వినకుంటే నక్సల్స్ ముప్పునకు ముగింపు పలికేందుకు ‘ఆలౌట్ ఆపరేషన్’ చేపడతామని అమిత్షా హెచ్చరించారు.
మావోయిస్టులపై జరుపుతున్న ఆపరేషన్లలో.. భద్రతా దళాలు ప్రగతిని సాధించాయని తెలిపారు. ప్రస్తుతం చత్తీస్ఘడ్లోని కేవలం 4 జిల్లాలకే మావోలు పరిమితం అయినట్లు ఆయన వెల్లడించారు. ‘దేశంలో నక్సల్ హింస, సిద్ధాంతాలను తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నారు. నక్సల్ సమస్య ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని కేవలం నాలుగు జిల్లాకే పరిమితమైంది. మావోయిస్టులపై జరిపిన ఆపరేషన్లలో భద్రతా బలగాలు గణనీయమైన విజయాన్ని సాధించాయి’ అని తెలిపారు.
`నేపాల్లోని పశుపతినాథ్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటు చేసుకోవాలని నక్సల్ గతంలో నిర్ణయించారు. అయితే మోదీ ప్రభుత్వం వారి ఎత్తులను చిత్తు చేసింది. ఛత్తీస్గఢ్లో నక్సల్ బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ సంక్షేమ పథకాన్ని తీసుకురానుంది. దీని ద్వారా ఉద్యోగ, ఆరోగ్య, ఇతర రంగాలలో వారికి సహాయం చేస్తాం’ అని అమిత్ షా భరోసా ఇచ్చారు.