78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అత్యధిక సమయం స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధానిగా ఘనత సాధించారు. ఈ రోజు ఎర్రకోటపై జాతీయజెండాను ఆవిష్కరించిన అనంతరం 98 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించారు. 2016లో ఇదే రోజున ఆయన 96 నిమిషాల పాటు దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు.
2014లో ప్రధానమంత్రిగా ఎర్రకోట నుంచి మోదీ తొలి ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఆ ఏడాది 65 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు.
2015లో 86 నిమిషాలు ప్రసంగించారు. 2016లో ఏకంగా 96 నిమిషాల పాటు ప్రసంగం చేశారు.
2017లో గంట కంటే తక్కువగా 56 నిమిషాల పాటు మాట్లాడారు. ఆ మరుసటి ఏడాది 83 నిమిషాలు ప్రసంగించారు.
2019లో రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత పాల్గొన్న తొలి స్వాతంత్ర్య వేడుకల్లో 92 నిమిషాల పాటు ప్రసంగం చేశారు.
2020లో 90 నిమిషాలు, 2021లో 88 నిమిషాలు మాట్లాడారు. 2022లో 74 నిమిషాలు, 2023లో 90 నిమిషాలు దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేడు 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇది ఆయనకు 11వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం.
ప్రధానిగా ఇప్పటివరకు అత్యధిక పంద్రాగస్టు ప్రసంగాలు చేసింది జవహర్లాల్ నెహ్రూ. మొత్తంగా 17 సార్లు ఆయన స్వాత్రంత్య దినోత్సవం నాడు జాతినుద్దేశించి ప్రసంగించారు.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 16 సార్లు పంద్రాగస్టు నాడు మాట్లాడారు. 1972లో సుదీర్ఘంగా 54 నిమిషాలు ప్రసంగించారు.
ఇక, మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ కేవలం ఒకే ఒక్కసారి ఎర్రకోట నుంచి ప్రసంగించారు. 1947లో నెహ్రూ, 1997లో గుజ్రాల్ వరుసగా 72, 71 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రధాని మోదీ తర్వాత సుదీర్ఘంగా ప్రసంగించింది వీరే.
మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహరీ వాజ్పేయీ స్వల్ప ప్రసంగాలు చేశారు. 2012లో మన్మోహన్ సింగ్ 32 నిమిషాలు, 2013లో 35 నిమిషాలు మాట్లాడారు.
వాజ్పేయీ 2002లో 25 నిమిషాలు, 2003లో 30 నిమిషాల పాటు ప్రసంగించారు.