News

అక్టోబరు 4 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

45views

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రెండు నెలల సమయం ఉన్నందున, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టిటిడి అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.

తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై జరిగిన తొలి సమావేశంలో టీటీడీ అదనపు ఈవో ఇంజినీరింగ్‌ పనులు, వాహనాల ఫిట్‌నెస్, లడ్డూ బఫర్ స్టాక్, అన్నప్రసాదం, దర్శనం, వసతి, కళాబృందాల కార్యక్రమాలు, ఉద్యానవన శాఖ, ట్రాన్స్పోర్ట్, కళ్యాణ కట్ట, గోశాల,శ్రీవారి సేవకులు, టీటీడీ విజిలెన్స్‌ విభాగం భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

కాగా ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రముఖంగా అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి.

సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కారణంగా , అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుండి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది.