ArticlesNews

శ్రేష్ఠ మాసం జ్యేష్ఠం

88views

మండుటెండలు, తొలకరి జల్లులు కలగలిసిన మాసం జ్యేష్ఠం. పేరుతో పెద్ద(జ్యేష్ఠ) కలిగిన మాసమిది. తెలుగువారు చంద్రమానం అనుసరిస్తారు కాబట్టి కొత్త ఏడాది ఛైత్రంతో ప్రారంభమై పాల్గుణంతో ముగుస్తుంది. తెలుగు నెలల్లో మూడోది జ్యేష్ఠం. ఛైత్ర, వైశాఖం తర్వాత వచ్చే జ్యేష్ఠ మాస పుణ్య కాలంలో చేసే పూజలు, జపాలు, పారాయణాదులకు విశేష ఫలముంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది జూన్ 7న ప్రారంభం అయిన జ్యేష్ఠ మాసం జూలై 5తో ముగుస్తుంది.

గ్రీష్మతాపం హెచ్చుగా ఉండే నెల ఇది. ఈ కాలంలో మనుషులు, జీవజాలమంతా దాహార్తితో అలమటిస్తుంటుంది. అందుకే జ్యేష్ఠంలో జలదానాన్ని విశేషంగా చేయమని నిర్దేశించారు మన పూర్వికులు. విధిగా చలివేంద్రాలు నెలకొల్పడం, పశుపక్ష్యాదుల కోసం నీటి తొట్టెలు, ముంతలు ఏర్పాటు చేయమని సూచించారు. నీటి విలువ అనుభవపూర్వకంగా తెలియడం కోసమే ఈ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని(జూన్17) ‘నిర్జల ఏకాదశి’గా జరుపుకుంటారు. నిర్జల ఏకాదశి నాడు మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవసిస్తారు.

జ్యేష్ఠ పౌర్ణమి నాడు(జూన్22) వటసావిత్రీ వ్రతాన్ని ఆచరిస్తారు. యమధర్మరాజును ఎదిరించి పతి ప్రాణాలు దక్కించుకున్న సతీసావిత్రిని ఆదర్శంగా తీసుకొని సౌభాగ్యం కోసం సుమంగళులు గౌరీదేవిని అర్చిస్తారు. అదే రోజు రైతులు ఎంతో ప్రియమైన ‘ఏరువాక పౌర్ణమి’ చేసుకుంటారు. ఈ సందర్భంగా రైతులు సాగులో సాయం చేసే ఎడ్లను, నాగలి, కొర్రు వంటి వ్యవసాయ ఉపకరణాలను అలంకరించి వర్షాలకు స్వాగతం పలుకుతారు.