News

మణిపూర్‌లో డ్యామ్‌ను పేల్చివేసే కుట్రను భగ్నం చేసిన భారత సైన్యం

96views

మణిపూర్‌లోని తూర్పు ఇంఫాల్ జిల్లాలో భారీ పేలుడు కుట్రను భారత సైన్యం ముందుగా పసిగట్టి భగ్నం చేసింది. నాంగ్‌డామ్ నుంచి ఈథామ్ తాంగ్‌ఖుల్ గ్రామాలను కలిపే రహదారిపై మూడు ఐఈడీ బాంబులను అమర్చిన సంగతిని సైన్యం కనుగొంది. మాఫౌ డ్యామ్ చేరువలో అమర్చిన ఆ బాంబులను డిఫ్యూజ్ చేసి పెద్ద ప్రమాదాన్ని తప్పించింది.

‘‘నాంగ్‌డామ్‌, ఈథామ్ గ్రామాల మధ్య 46 కిలోమీటర్ల రహదారి ఉంది. ఆ దారిలో నాంగ్‌డామ్‌కు చేరువలో మాఫౌ డ్యామ్ ఉంది. అతివాదుల ప్రాబల్యం ఎక్కువ ఉన్న ప్రాంతం కావడంతో అక్కడ భారత సైన్యం తరచుగా తనిఖీలు చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో ఆదివారం సైన్యం ఆ రహదారిలో సర్వెయిలెన్స్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. అప్పుడు రహదారి పక్కన మూడు ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్ అమర్చి ఉండడాన్ని సైనిక పటాలం గమనించింది’’ అని భారత సైన్యం అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు.

‘‘బాంబులు ఉన్న ప్రదేశం చేరువలోని సామాన్య ప్రజలను సైన్యం మొదట అక్కడినుంచి తరలించింది. ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుంది. అంతలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అక్కడకు చేరుకుంది. వారు మూడు ఐఈడీ బాంబులను జాగ్రత్తగా నిర్వీర్యం చేసారు. ఆ ప్రక్రియలో స్థానికులకు ఎలాంటి ప్రమాదమూ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు’’ అని వివరించారు.అంతేకాదు ఆ పేలుడు చేపట్టడానికి ఏర్పాటు చేసిన కమాండ్ మెకానిజంను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాన్నిబట్టి అతివాదుల వద్దనున్న ఆయుధాలు అత్యంత ఆధునికమైనవని నిపుణులు చెబుతున్నారు.