భారతదేశానికి భూతాపం (గ్లోబల్ వార్మింగ్) అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోందని జనాభాలో 90 శాతానికిపైగా ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. ఉష్ణతాపంతో వరదలు, కరవు, వడగాలులు, తీవ్ర నీటి కొరత, కాలుష్యం, జంతువులకు రోగాలు, అతివృష్టి, అనావృష్టి సంభవిస్తోందని సర్వేలో పాల్గొన్న పలువురు తెలిపారు. భూతాపాన్ని తగ్గించేందుకు సంప్రదాయేతర ఇంధన వనరులు వినియోగించాలని, కర్బన ఉద్గారాలను సున్నాకు తగ్గించాలని అభిప్రాయపడ్డారు. 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నాకు తేవాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు వేగంగా అడుగులు వేయాలని కోరారు. యేల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ కమ్యూనికేషన్, సీఓటర్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా ‘క్లైమేట్ ఛేంజ్ ఇన్ది ఇండియన్ మైండ్ -2023’ నివేదికను అమెరికాలో విడుదల చేశాయి.
దుర్భరంగా ప్రజల జీవితాలు..
వాతావరణ మార్పులతో ప్రజల దైనందిన జీవితాలు దుర్భరంగా ఉంటున్నట్లు సర్వేలో తెలిసింది. వాతావరణ మార్పులతో కుటుంబాలకు వస్తున్న ఆదాయం సరిపోవడం లేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. భూతాపాన్ని తగ్గించేందుకు ఇంధన సామర్థ్య ఉపకరణాలు, విద్యుత్తు వాహనాల కొనుగోలుకు ఎక్కువ మొత్తంలో ఖర్చుచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వాతావరణ మార్పులతో తీవ్ర వరదలు, తుపానులు వస్తున్నాయని యేల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఆంథోని లిసిరోవిట్జ్ చెప్పారు. భారతీయులకు స్వచ్ఛ ఇంధనంతో ఆర్థిక సుస్థిరత, మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ ప్రొ.డా.జగదీష్ థాకెర్ తెలిపారు.