News

విడుదలైన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

58views

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

అదేవిధంగా, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన కోటాను ఉదయం 11 గంటలకు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలో గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు, శ్రీవారి సేవ కోటాను ఈ నెల 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ కోటాను మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.