News

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు రూ.కోటితో విద్యుత్తు ఏర్పాట్లు

192views

ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు రూ.కోటి వెచ్చించి దేదీప్యమానంగా వెలుగులు ప్రకాశించేలా ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి విద్యుత్తు విభాగం ఎస్‌ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. రామాలయం, కల్యాణ వేదిక ప్రాంగణం, పార్కింగ్‌ స్థలాలను ఆర్టీసీ ఆర్‌ఎం గోపాల్‌రెడ్డితో కలసి ఆయన గురువారం పరిశీలించారు. ఎస్‌ఈ మాట్లాడుతూ కల్యాణోత్సవాన్ని భక్తులు వీక్షించడానికి 24 అత్యాధునిక ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్‌ఎం గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ భక్తులకు అనువుగా ప్రత్యేక బస్సులను నిరంతరాయంగా నడుపుతామని తెలిపారు.

13న రామాలయంలో పసుపు దంచే కార్యక్రమం…: కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తితిదే ఆధ్వర్యంలో ఈ నెల 13న శనివారం తొలిసారిగా పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రత్యేకాధికారిణి ప్రశాంతి గురువారం తెలిపారు. ఇందుకోసం కొత్తగా రోళ్లు, రోకళ్లు కొనుగోలు చేస్తున్నామని వివరించారు. మన సంప్రదాయం, సంస్కృతులను నేటి తరానికి పరిచయం చేయాలని ఈ క్రతువుకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు.