
ముస్లిం దేశమైన పాకిస్తాన్లో మైనారిటీలకు రక్షణ లేకుండా పోతోంది. రోజురోజుకు పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. అందుకు తాజా ఘటనే తార్కాణం.
పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్లో హిందూ యువతుల అపహరణ ఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. హిందూ యువతులు, బాలికలను ఎత్తుకెళ్లి.. వారిని ఇస్లాం మతంలోకి మార్చి వివాహం చేసుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సింధ్ ప్రావిన్సులోని సుక్కుర్ నగరంలో ఓ హిందూ యువతి కిడ్నాప్కు గురైంది. దీంతో అక్కడ ఉన్న మైనారిటీ వర్గాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇది కాస్తా పక్కనే ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్సుకు కూడా పాకింది. అపహరణకు గురైన యువతి ప్రియా కుమారి అని స్థానికులు తెలిపారు. ప్రియా కుమారి కిడ్నాప్కు వ్యతిరేకంగా డేరా మురాద్ జమాలీలో ఉండే హిందూ వ్యాపారులు, ప్రజలు రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసనలు తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ప్రియా కుమారిని విడిపించాలని డిమాండ్ చేశారు.
మైనారిటీ వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సింధ్ సీఎం మురాద్ అలీ షాని కోరారు. పాకిస్తాన్లో మైనారిటీలపై జరుగుతున్న మతపరమైన హింసను హ్యూమన్ రైట్స్ ఫోకస్ తీవ్రంగా ఖండించింది.
పాక్లో మెజారిటీలతోపాటు మైనారిటీలకు కూడా సమాన హోదా చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గత కొన్ని నెలలుగా హిందువులతోపాటు క్రిస్టియన్లు, అహ్మదీయ ముస్లింలు, సిక్కులు, ఇతర వర్గాలకు చెందిన అనేక మంది మహిళలు, యువతలు ఇలా కిడ్నాప్కు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది.
పాకిస్తాన్లో మైనారిటీలుగా ఉన్న హిందువులు, సిక్కులపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ వాటి ఊసెత్తని పాక్ ప్రభుత్వం, అంతర్జాతీయ వేదికలపై భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని గగ్గోలు పెడుతుండటం హాస్యాస్పదం.





