News

ముస్లిం వివాహ చట్టం రద్దు.. దీని వల్ల వచ్చే మార్పులేంటి?

305views

అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. యూనిఫాం సివిల్ కోడ్‌కి పెద్దపీట వేస్తూ.. ముస్లింలలో వివాహాలు & విడాకులను Mనియంత్రించే వ్యక్తిగత చట్టాన్ని రద్దు చేయాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల ప్రారంభంలో యూసీసీ చట్టాన్ని ఉత్తరాఖండ్ ఆమోదించగా, అస్సాం కూడా ఇలాంటి చట్టాన్నే తీసుకురావాలని భావించింది. ఫిబ్రవరి 28వ తేదీతో ముగిసే బడ్జెట్ సెషన్‌లో అస్సాం ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అస్సాం మంత్రి జయంత మల్లా బారుహ్ మాట్లాడుతూ.. ముస్లిం వివాహాలు & విడాకుల నమోదు చట్టాన్ని రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. అలాంటి విషయాలను ‘ప్రత్యేక వివాహ చట్టం’ కిందకు తీసుకురావాలని ప్రభుత్వం కోరుకుంటోందని స్పష్టం చేశారు.

ముస్లిం వివాహ చట్టం రద్దుతో వచ్చే మార్పులేంటి?
ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం.. ముస్లింలు వివాహాలు, విడాకులను స్వచ్ఛందంగా నమోదు చేసుకోవచ్చు. అటువంటి విషయాలపై కేసులను నమోదు చేయడం చట్టం ప్రకారం తప్పనిసరి కాదు. రిజిస్ట్రేషన్ మెషినరీ కూడా అనధికారికంగా ఉందని, ఇది ప్రస్తుత నిబంధనలను పాటించకపోవడానికి ఒక స్కోప్‌ను అందిస్తుందని సీఎం హిమంత పేర్కొన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేసిన తర్వాత సమాజంలో వివాహాలు, విడాకులు నమోదు చేయడానికి లైసెన్స్‌లను కలిగి ఉన్న ముస్లిం రిజిస్ట్రార్లు.. ఇకపై ఆ హక్కుని కోల్పోతారు. అస్సాంలో మొత్తం 94 ముస్లిం రిజిస్ట్రార్‌లు ఉన్నాయని.. ముస్లిం వివాహ చట్టాన్ని రద్దు చేసిన తర్వాత వాళ్లకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి బారుహ్ హామీ ఇచ్చారు. చట్టాన్ని రద్దు చేశాక.. జిల్లా కమీషనర్లు, జిల్లా రిజిస్ట్రార్‌లు ‘రిజిస్ట్రేషన్ రికార్డుల కస్టడీ’ని కలిగి ఉంటారు. ఇకపై రిజిస్ట్రేషన్‌లు అస్సాం ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పర్యవేక్షణలో జరుగుతాయి.

ప్రస్తుతం అమల్లో ఉన్న ముస్లిం వివాహ చట్టంలోని కొన్ని నిబంధనలు.. వధువు(18), వరుడు(21) లీగల్ ఏజ్‌‌కి చేరుకోకపోయినా వివాహాలను నమోదు చేసుకోవడానికి అనుమతిస్తాయి. అంటే.. బాల్య వివాహాల్ని ఈ చట్టం అనుమతిస్తోందని, దాన్ని అరికట్టడం కోసమే దాన్ని రద్దు చేయడం జరిగిందని సీఎం హిమంత పేర్కొన్నారు. ఇదే సమయంలో బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. కొత్తం చట్టంతో రాష్ట్రంలో మంచి వాతావరణం ఏర్పడుతుందన్నారు. ఉత్తరాఖండ్‌లో ఇప్పటికే ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ తీసుకొచ్చామని.. ఇప్పుడు అస్సాంలోని హిందువులు, ముస్లింలకు ఒకే చట్టం ఉంటుందని తెలిపారు. బాల్యవివాహాల్ని అంతమొందించే ప్రయత్నం ఇదని పేర్కొన్నారు.