News

గవర్నర్‌ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల నిరసన

242views

కేరళ గవర్నర్‌ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ ఎదుట నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసిన కమ్యూనిస్ట్- ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే కేరళలోని మట్టన్నూరులో ఆదివారం సాయంత్రం కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) కార్యకర్తలు నల్లజెండాలు చూపించారు.

అడవి ఏనుగుల దాడిలో మృతి చెందిన ఆరీఫ్ మహ్మద్ అజీష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.. కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాయనాడ్ వైపు వెళ్తుండగా ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బాధిత కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.

ఈ నేపధ్యంలో కొందరు ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కూడా తమ నిరసన ప్రదర్శన కొనసాగుతుందని కార్యకర్తలు తెలిపారు.

కేరళలోని మనంతవాడి సమీపంలోని నివాస ప్రాంతంలోకి చొరబడిన ఏనుగు ఆరీఫ్ మహ్మద్ అజీష్ అనే వ్యక్తిపై దాడి చేసి, చంపేసింది. ఈ నేపధ్యంలో కేరళ ప్రభుత్వం మృతుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ఉన్నతాధికారులను ఆదేశించారు.