
శ్రీరాముడి ఆశీస్సులతోనే అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరిగిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా.మోహన్ భాగవత్ అన్నారు. రామమందిర నిర్మించాలనే సంకల్పాన్ని సాహసోపేత చర్యగా అభివర్ణించిన మోహన్ భాగవత్, దేవుడి ఆశీస్సులు, అనుగ్రహం కారణంగానే భవ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగిందన్నారు.
మహారాష్ట్రలోని పుణే జిల్లా అలాండిలో నిర్వహించిన ఆద్మాత్మిక గురువు శ్రీ గోవింద్ దేవ్ గిరిజీ మహారాజ్ జయంతి సందర్బంగా ‘గీతా భక్తి అమృత మహోత్సవం’లో పాల్గొన్న మోహన్ భాగవత్, ప్రపంచం మొత్తానికి భారతదేశ అవసరం ఉందన్నారు. భారత్ దేశం ఎదగాల్సి ఉందని, ఏదో ఒక కారణంతో అది జరగకపోతే, ప్రపంచం మొత్తానికి ఇబ్బందికరంగా మారుతుందన్నారు.

భారత్ ఎంతో ఎత్తుకు ఎదగడంతో పాటు అంతే బలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎన్నో ఏళ్ళ పోరాటం తర్వాతే రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిందని గుర్తు చేసిన మోహన్ భాగవత్, ప్రస్తుతం తరం ఎంతో అదృష్టం చేసుకుందన్నారు. రాముడి తన జన్మస్థలంలో కొలువుదీరడాన్ని ఈ తరం చూడటం ఎంతో గొప్ప విషయమన్నారు.
ప్రస్తుత కాలంలో పురాతన గ్రంథం అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని కోరిన భాగవత్, కాలం మారినప్పటికీ విజ్ఞాన యొక్క ప్రధాన భాగం అలాగే ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు.





