News

పాక్‌ ఎన్నికల్లో హిందూ మహిళ ప్రచారానికి ఆదరణ

204views

ఫిబ్రవరి 8న పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులంతా విరివిగా ప్రచారాలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన హిందూ మహిళ సవీరా ప్రకాష్ వార్తల్లో నిలిచారు. పాక్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళగా ఆమె గుర్తింపు పొందారు.

హిందువు అయినప్పటికీ, ముస్లిం ప్రాబల్యం కలిగిన ప్రాంతాలలో ఆమె ప్రచారం సాగించినప్పుడు ఆమెకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. సవీరా ప్రకాష్ పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని బునెర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఆమెకు టికెట్ ఇచ్చింది. సవీరా వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమె తండ్రి పేరు ఓం ప్రకాష్. ఆయన పీపీపీలో సభ్యునిగా ఉ‍న్నారు. ఆయన వైద్య వృత్తిలో రాణిస్తున్నారు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా మీడియాతో సవీరా ప్రకాష్ మాట్లాడుతూ తాను భారత్-పాక్ మధ్య సత్సంబంధాలకు వారధిగా పని చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను డాక్టర్‌నని, పాక్‌లోని ఆసుపత్రుల్లో పరిస్థితులను మెరుగుపరిచేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఆమె తెలిపారు. సవీరా 2022లో మెడికల్ కాలేజీ నుండి పట్టా పుచ్చుకున్నారు.

బునర్ అసెంబ్లీలో పీపీపీ పార్టీ మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె చాలా కాలంగా తండ్రితోపాటు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పాకిస్తాన్‌లో మహిళల అభ్యున్నతి, ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు ఆమె కృషి చేస్తున్నారు. ఇదిలావుండగా పాక్‌ ఎన్నికలకు ముందు గత మూడు రోజులుగా కరాచీ, బలూచిస్థాన్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయాల వెలుపల పేలుళ్లు జరిగాయి.