News

ప్రపంచశాంతికి కేంద్రం భారతదేశమే : డా. మోహన్ భాగవత్

313views

భారతదేశమే ప్రపంచశాంతికి కేంద్రస్థానమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో శిఖా ఓ అనుసంధాన్ SOA University విశ్వవిద్యాలయం నిర్వహించిన బహుళ భాషల సాహితీ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

భారతదేశం ఇప్పుడు ప్రపంచ వేదికపై కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సమర్థమైన నాయకత్వంతో ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచిపెడుతోందని వివరించారు. ప్రపంచంలో శాంతిని స్థాపించడానికి కావలసిన అన్ని వనరులు, మౌలిక సాధనాలూ భారత్ వద్ద ఉన్నాయని డా. మోహన్ భాగవత్ స్పష్టం చేసారు. దేశంలో ఇప్పుడు అద్భుతమైన పరివర్తన చోటు చేసుకుంటోందనీ, అభివృద్ధి సాకారమవుతోందనీ ఆయన గమనించారు. అదే సమయంలో మరింత పురోగమించవలసిన ఆవశ్యకతను ఆయన ప్రస్తావించారు. ముందుచూపుతో జాతీయ సమైక్యత, సమృద్ధి అనే విలువైన వనరులను సమర్ధంగా వినియోగించుకోవాలని దేశానికి సూచించారు.

సాహిత్యాన్ని సామాజిక-ఆర్థిక దృక్కోణంలోనుంచి పునర్నిర్వచిస్తూ, సామాజిక పరివర్తనను సాకారం చేయడంలో మానవుడి ఆధ్యాత్మిక ఉన్నతి ఎంతో ఉపయోగపడుతుందని భాగవత్ విశదీకరించారు. సాహిత్యం సమాజాన్ని కళ్ళకు కట్టే దర్పణమనీ, సమాజంలో గణనీయమైన మార్పును తేగల ఉత్ప్రేరకమనీ వివరించారు. సమాజంలోని ప్రతీ చిన్న సంఘటననూ, ప్రతీ సిద్ధాంతాన్నీ చాటడం ద్వారా సాహిత్యం అభిప్రాయ నిర్ణేతలను తయారు చేస్తుంది. వారు సాధారణ ప్రజలను ఏకం చేస్తారు, జాతి లక్ష్యాలను సాధిస్తారు… అని వివరించారు. సాహిత్యానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ స్వతంత్రానంతర భారతదేశంలో సాహిత్యం పోషించిన కీలకమైన పాత్రను ప్రశంసించారు. నిజమైన మతాన్ని విస్మరించిన బ్రిటిష్ వారి వలస పాలనను వ్యతిరేకించిన పోరాటంలో సాహిత్యం ప్రధాన పాత్ర పోషించిందని ఆయన చాటిచెప్పారు.

స్థూలంగా చూస్తే, ప్రపంచదేశాలన్నీ ఇవాళ సరైన మార్గదర్శనం కోసం, ప్రేరణ కోసం భారతదేశం వైపు చూస్తున్నాయని డా. మోహన్ భాగవత్ స్పష్టం చేసారు. ఈ దేశపు దార్శనికులు, సాధుసంతులు ఇక్కడ విలువైన నాయకత్వాన్ని ఇస్తున్నారు, తద్వారా ప్రపంచ శాంతికి తమ వంతు కృషి చేస్తున్నారని మోహన్ భాగవత్ చెప్పారు.

సమాజంలో మార్పు తీసుకురావడంలో సాహిత్యం పాత్ర గురించి మేధావులు, సాహితీ ఆసక్తిపరులు చర్చలు జరిపేందుకు బహుభాషా సాహిత్య సదస్సు వేదికగా నిలిచింది. కొన్ని ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు సమైక్యతను ప్రబోధించి దృక్కోణాలను నిర్మించడంపై సాహిత్యం గణనీయమైన ప్రభావం చూపుతుందని మోహన్ భాగవత్ స్పష్టంగా చెప్పారు. ప్రపంచ వేదికలపై బలమైన శక్తిగా నిలుస్తున్న భారతదేశానికి ఆర్థిక, రాజకీయ రంగాల్లోనే కాక ఆధ్యాత్మిక జ్ఞానం, సాంస్కృతిక వైభవాల్లో ప్రపంచానికి వెలుగుదివ్వెగా నిలిచే సామర్థ్యం ఉందని భాగవత్‌జీ తన సందేశంలో స్పష్టంగా చెప్పారు.