
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ డిటోనేటర్ల(electric detonator) తయారీ, వీటిని కలిగి ఉండటం, దిగుమతులు చేసుకోవడంపై నిషేధం విధిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నిషేధం 2025 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్టు స్పష్టంచేసింది. భద్రతాపరమైన ఆందోళనలు, ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఎలక్ట్రిక్ డిటోనేటర్లు ప్రమాదకరమైన స్వభావం కలిగినవని కేంద్రం అభిప్రాయపడినట్టు పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) పేర్కొంది. ఈ నిషేధంతో ప్రజా భద్రతకు ప్రయోజనకరమని పేర్కొంటూ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. 2024-25 చివరి నాటికి వీటి ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు కేంద్రం తెలిపింది. ఎలక్ట్రిక్ డిటోనేటర్లపై నిషేధం 2025 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని స్పష్టంచేస్తూ నోటిఫికేషన్లో పేర్కొంది.





