
పీస్ టీవీ వ్యవస్థాపకుడు, వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్కు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. 2016లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఉగ్రదాడికి ప్రేరేపించాడన్న ఆరోపణలతో చార్జ్ షీట్ నమోదు చేసింది. అలాగే అతనిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేశామని ముంబై కోర్టులో దాఖలు చేసిన ఫైలింగ్లో ఈడీ వెల్లడించింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. 22మందికి మృతికి కారణమైన జకీర్కు సంబంధించి మొత్తం రూ.193 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్టు తెలిపింది.
అతని కుటుంబ సభ్యులనుంచి నుంచి రూ .73.12 కోట్ల విలువైన ఆస్తులను ఎటాచ్ చేసినట్టు ఈడీ కోర్టుకు తెలిపింది. ఇప్పటికే రూ .50.46 కోట్ల ఆస్తులను ఎటాచ్ చేసిన ఈడీ చార్జిషీట్ను నమోదు చేసినట్టు తెలిపింది. దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీ పెట్టుబడులు పెట్టాడని ఈడీ ఆరోపించింది. వీటితో పాటు చెన్నైలోని ఇస్లామిక్ ఇంటర్నేషనల్ స్కూల్, ముంబై, పూణెలలో అతి ఖరీదైన ఫ్లాట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆస్తులను కలిగి వున్నాడని ఈడీ తెలిపింది.
ఇటీవల శ్రీలంలో రాజధాని కొలంబో వరుస పేలుళ్ల ఘటనలో జకీర్ నాయక్ ప్రమేయం అంశాన్ని ఎన్ఐఏ పరిశీలిస్తోంది. మరోవైపు దుబాయ్ కేంద్రంగా ప్రసారాలు జరుగుతున్న జకీర్ నాయక్కు చెందిన పీస్ టీవీలో తన బోధనల ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పీస్ టీవీని శ్రీలంకలో నిషేధించారు.





