
లిబరేషన్ ఆఫ్ తమిళ్ ఈళం (LTTE) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నట్టు తమిళ నేషనలిస్ట్ మూమెంట్ నేత పి.నెడుమారన్ సోమవారం చేసిన సంచలన ప్రకటనను శ్రీలంక ప్రభుత్వం తొసిపుచ్చింది. అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలేవీ తమ వద్ద లేవని స్పష్టం చేసింది. ప్రభాకరన్ మరణించినట్టు ధ్రువీకరించే డీఎన్ఏ సర్టిఫికెట్స్తో సహా అన్ని ఆధారాలు శ్రీలంక వద్ద ఉన్నాయని శ్రీలంక డైరెక్టర్ మీడియా అండ్ ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ రవి హెరత్ మీడియాకు తెలిపారు.
”మీరు చెబుతున్న వ్యక్తి (వేలుపిళ్లై ప్రభాకరన్) బతికి ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు మా రికార్డుల్లో లేవు. ఆయన బతికున్నట్టు చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే ఈ విషయం చెప్పాలి. ఏ ఆధారంతో ఆయన (ప్రభాకరన్) బతికున్నట్టు ప్రకటించారనేది ఆయననే అడగండి” అని బ్రిగేడియర్ రవి అన్నారు. 2009లో శ్రీలంక సైన్యం ప్రభాకరన్ను మట్టుబెట్టిందని చెప్పారు. ఆ రోజుతేనే యుద్ధం ముగిసిందని చెప్పారు. ప్రభాకరన్ బతికున్నట్టు చెబుతున్న సమాచారంపై శ్రీలంక ప్రభుత్వం ఏమైనా చర్చలు తీసుకోనుందా అని అడిగినప్పుడు, అలాంటి ప్లాన్స్ ఏవీ లేవని, అయితే సమీప భవిష్యత్తులో దీనిపై విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పారు. కాగా, ప్రభాకరన్ బతికున్నట్టు వస్తున్న వార్తలపై శ్రీలంక విదేశాంగ శాఖ మంత్రి అలి సబ్రి ఆచితూచి స్పందించారు. ఆ వార్తలు పరిశీలించి, తగినరీతిలో స్పందిస్తామని తెలిపారు.
వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారని, మంచి ఆరోగ్యంతో కూడా ఉన్నారని పి.నెడుమారన్ సోమవారం చెన్నైలో సంచలన ప్రకటన చేశారు. అయితే ప్రస్తుతం ప్రభాకరన్ ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని ఆయన బయట పెట్టలేదు. త్వరలోనే ప్రభాకరన్ జనం ముందుకు వస్తారని మాత్రం వెల్లడించారు. ప్రభాకరన్ కుటుంబం కూడా సురక్షితంగా ఉందని, తాను వారితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నానని అన్నారు. ప్రభాకరన్ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్న తర్వాతే ఈ విషయాలను తాను బయట పెడుతున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలందరికీ తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఇంతవరకూ ప్రభాకరన్ గురించి ఒక పద్ధతి ప్రకారం వ్యాప్తి చేసిన ఊహాగానాలకు ఈ వార్తతో తెరపడుతుందని ఆశిస్తున్నానని నెడుమారన్ అన్నారు. ప్రభాకరన్ సరైన సమయంలో జనం ముందుకు వస్తారని, తమిళ ఈళం గురించి సమగ్ర ప్రణాళికను ప్రభాకరన్ త్వరలోనే ప్రకటించనున్నారని వెల్లడించారు.





