News

భార్యకు ట్రిపుల్‌ తలాఖ్‌ చెప్పి.. జంపవుతున్న భర్త అరెస్టు!

210views

దేశంలో ట్రిపుల్ తలాఖ్ వ్యవహారం మరోసారి ఢిల్లీలో వెలుగుచూసింది. భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పి ఢిల్లీ నుంచి బెంగళూరు పారిపోతున్న ఓ డాక్టరును బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రిపుల్ తలాఖ్ ముప్పు నుంచి రక్షించడానికి 2019వ సంవత్సరంలో ట్రిపుల్ తలాఖ్ వ్యతిరేక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేసింది. ఢిల్లీలోని కళ్యాణ్ పురికి చెందిన 40 ఏళ్ల వైద్యుడు 36 ఏళ్ల భార్యను ట్రిపుల్ తలాఖ్ ఇచ్చాడని పోలీసులు చెప్పారు. ట్రిపుల్ తలాఖ్ ఇచ్చాక ఢిల్లీ డాక్టర్ బెంగళూరు నుంచి యూకేకు వెళ్లేందుకు యత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి గుర్తింపును రహస్యంగా ఉంచేందుకు నిందితుడి పేరును పోలీసులు వెల్లడించలేదు.

ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని తాను 2018వ సంవత్సరంలో కలిశానని.. విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ల పరీక్షకు సిద్ధమవుతున్న డాక్టర్‌గా తనను తాను పరిచయం చేసుకున్నాడని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ జంట 2020 వసంవత్సరంలో వివాహం చేసుకుంది. వీరికి పిల్లలు లేరు. వారి వివాహమైన కొన్ని నెలల తర్వాత నిందితుడు తన భార్యకు తాను కొన్ని పరీక్షలకు సిద్ధం కావాలని కోరుకుంటున్నానని, అందుకే తన చదువుపై దృష్టి పెట్టేందుకు ఢిల్లీలోని వేరే ప్రాంతంలో ఆమెకు దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పాడు.

ఇక వివాహమైన ఒక సంవత్సరంలోపే నిందితుడు కళ్యాణ్‌పురిలోని తూర్పు వినోద్ నగర్‌కు మారారు. భార్య లజ్‌పత్ నగర్‌లో నివాసముంది. ఈక్రమంలో గత ఏడాది అక్టోబర్ 13న కళ్యాణ్‌పురిలోని భర్త ఇంటికి ఆమె వెళ్లగా.. అక్కడ అతను మరో మహిళతో కలిసి ఉంటున్నాడని తెలుసుకుంది. భర్త తనను కొట్టాడని, తనకు ట్రిపుల్ తలాఖ్ చెప్పాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యకు ఎందుకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించగా.. ఆమెతో కలిసి ఉండడం ఇష్టం లేదని నిందితుడు పోలీసులకు చెప్పాడు.ట్రిపుల్ తలాఖ్ ఇచ్చిన భర్తపై ఐపీసీ 323 కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామని పోలీసులు వివరించారు