
సరికొత్త ‘అగ్నిపథ్’ పథకానికి మార్గనిర్దేశకులు మీరేనని త్రివిధ దళాల తొలి బ్యాచ్ అగ్నివీరులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించి.. అభినందనలు తెలిపారు. ఈ పరివర్తన విధానం సాయుధ బలగాలను పటిష్ఠం చేయడంలో కీలకంగా మారుతుందని, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు వారిని సిద్ధంగా ఉంచుతుందని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ సోమవారం అగ్నివీరుల తొలి బ్యాచ్నుద్దేశించి మాట్లాడారు. యువ అగ్నివీరులు సాయుధ దళాలను మరింత యువోత్సాహం, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన శక్తిగా మారుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
‘నవ భారతం నూతన శక్తితో నిండి ఉంది. మన బలగాలను ఆధునికీకరించడంతోపాటు వాటిని ఆత్మనిర్భర్గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 21వ శతాబ్దంలో యుద్ధాల తీరు మారుతుంది. సాంకేతికంగా ముందంజలో ఉండే సైనికులదే సాయుధ దళాల్లో ముఖ్య భూమిక అని మోదీ తెలిపారు. ప్రస్తుత తరానికి ఈ సామర్థ్యం ఉంది. కాబట్టి.. సైన్యంలో అగ్నివీరులు కీలక పాత్ర పోషిస్తారు’ అని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా అగ్నివీరుల సామర్థ్యాన్ని కొనియాడుతూ, వారి స్ఫూర్తి.. సాయుధ బలగాల ధైర్యసాహసాలను ప్రతిబింబిస్తోందన్నారు. అగ్నివీరులుగా పొందే అనుభవం జీవితానికి గర్వకారణంగా ఉంటుందని తెలిపారు.
అగ్నిపథ్ పథకం మహిళలకు మరింత సాధికారత కల్పిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. త్రివిధ దళాల్లో మహిళా అగ్నివీరులను చూసేందుకు తాను ఎదురుచూస్తున్నానన్నారు. ‘భిన్న ప్రదేశాల్లో విధుల నేపథ్యంలో.. అక్కడి సంస్కృతితో మమేకం కావాలి. సమష్టిగా పని చేయడంతోపాటు ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలను మెరుగుపర్చుకోవాలి. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపాలి’ అని అగ్నివీరులకు సూచించారు. దేశ యువత, అగ్నివీరుల శక్తిసామర్థ్యాలను ప్రస్తావిస్తూ.. 21వ శతాబ్దంలో దేశానికి నాయకత్వం అందించనుంది వీరేనని ప్రధాని కొనియాడారు. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 25 వేలకు పైగా అగ్నివీరులు శిక్షణ పొందుతున్నారు.





