
ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఖలిస్తాన్ మద్దతుదారులు ఓ హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారనీ, “హిందూ-స్థాన్ ముర్దాబాద్” అనే భారత వ్యతిరేక గ్రాఫిటీతో ఆలయాన్ని ధ్వంసం చేశారని అక్కడి మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతోపాటు భారత్ కు వ్యతిరేకంగా అక్కడి ఆలయం గోడలపై హిందుస్తాన్ ముర్దాబాద్ అంటూ రాసుకురావడం కలకలం రేపింది. ఈ దాడికి పాల్పడిన ఖలిస్తాన్ మద్దతుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్ట్రేలియా పోలీసులు వెల్లడించారు.
ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఉన్న బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిర్ అనే హిందూ ఆలయంపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడిచేసి భారత వ్యతిరేక గ్రాఫిటీలతో ధ్వంసం చేశారని ఆస్ట్రేలియా టుడే ఒక నివేదికలో తెలిపింది. మెల్ బోర్న్ ఉత్తర శివారులోని మిల్ పార్క్ లోని ప్రముఖ స్వామినారాయణ ఆలయంపై దాడి చేయడంలోపాటు అక్కడి గోడలపై భారత్ కు వ్యతిరేకంగా రాసుకొచ్చారు. ఆలయం గోడలకు “హిందూస్తాన్ ముర్దాబాద్” అని పెయింట్ వేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిర్ కార్యాలయం. ” ఈ విధ్వంస.. విద్వేషపూరిత చర్యలతో తాము తీవ్రంగా బాధపడుతున్నాము. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యాము. శాంతి-సామరస్యం కోసం మేము మా ప్రార్థనలను అందిస్తున్నాము.. సరైన సమయంలో పూర్తి ప్రకటనను అందిస్తాము. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని” పేర్కొంది.
ప్రతిపాదిత సిక్కు మెజారిటీ రాష్ట్రమైన ఖలిస్తాన్ ఏర్పాటుకు విస్తృతంగా మద్దతుదారుగా భావిస్తున్న భారతీయ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రావాలేపై ఖలిస్తాన్ గ్రూప్ ప్రశంసలు కురిపించిందని నివేదిక సూచిస్తుంది. ఆపరేషన్ బ్లూస్టార్లో భాగంగా సైన్యం అతడిని హతమార్చింది. “ఈ విధ్వంసం విక్టోరియా శాంతియుత హిందూ సమాజానికి, ముఖ్యంగా ఈ పవిత్ర సమయంలో చాలా బాధ కలిగించింది” అని ఉత్తర మెట్రోపాలిటన్ ప్రాంతానికి లిబరల్ ఎంపి ఇవాన్ ముల్హోలాండ్ అన్నారు. “నేను ఈ రోజు ఉదయం ఆలయానికి చేరుకున్నప్పుడు, అన్ని గోడలకు హిందువులపై ఖలిస్తానీ ద్వేష గ్రాఫిటీ రంగులు వేయబడ్డాయి” అని స్థానికుడు ఆస్ట్రేలియా టుడేతో చెప్పారు. హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా విక్టోరియా రాష్ట్ర అధ్యక్షుడు మక్రాంద్ భగవత్ మాట్లాడుతూ ప్రార్థనా మందిరాలపై ఎలాంటి ద్వేషం, విధ్వంసం ఆమోదయోగ్యం కాదని, దీనిని ఖండిస్తున్నామని అన్నారు.
“ఈ రకమైన కార్యకలాపాలు విక్టోరియా జాతి-మత సహన చట్టాన్ని ఉల్లంఘిస్తాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విక్టోరియా పోలీసులు, ప్రధాని డాన్ ఆండ్రూస్ ను డిమాండ్ చేస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన విశ్వహిందూ పరిషత్ కూడా ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. కాగా.. ఇటీవలి కాలంలో విదేశాల్లోని పలు హిందూ ఆలయాలపై దాడులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్లో కెనడాలోని బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిర్ ‘కెనడియన్ ఖలిస్తానీ తీవ్రవాదులు’ భారత వ్యతిరేక గ్రాఫిటీలతో ధ్వంసం చేశారు. కెనడాలో హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది.





